బడుగులకు రుణాలివ్వని బాబు సర్కారు 

8 Aug, 2022 04:55 IST|Sakshi

బ్యాంకుల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీల రుణాల సబ్సిడీ 515 కోట్లు

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీపై పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్న మాటలు అబద్ధాలేనని తేలింది. ఆ ఐదేళ్లలో బడుగులకు అందాల్సిన సబ్సిడీ వారికి చేరలేదని వెల్లడైంది. ఆ సబ్సిడీ సొమ్మంతా బ్యాంకుల్లోనే మగ్గుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ కార్పొరేషన్లకు చెందిన సబ్సిడీ నిధులు రూ.515 కోట్లు ఎటువంటి వినియోగం లేకుండా ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది.

ఆయా వర్గాలకు రుణాలు మంజూరు చేయకపోవడంతో సబ్సిడీ నిధులు ఖాతాల్లోనే ఉండిపోయాయి. సబ్సిడీ రుణాల మంజూరు రికార్డులను తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న వినియోగ పత్రాలను ఇవ్వాలని సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కోరింది. పెండింగ్‌లో ఉన్న రుణాల సబ్సిడీ వివరాలను సంబంధిత శాఖలు కూడా బ్యాంకులకు సమర్పించాలని సూచించింది. మిగిలిపోయిన సబ్సిడీ రుణాల సొమ్మును బ్రాంచీలు ఆయా సంస్థలకు తిరిగి జమ చేయాలని ఆదేశించింది. సబ్సిడీ ద్వారా ఆ వర్గాలకు రుణాలివ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనట్లు ఈ నివేదికను బట్టి తేలింది.   

మరిన్ని వార్తలు