బాబూ.. నాడు ప్రేక్షకపాత్ర, నేడు విద్వేషాలకు కుట్ర!

13 Jul, 2021 04:03 IST|Sakshi

సీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణను నిరసిస్తూ ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలతో బాబు లేఖలు

కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే చర్యలకు అడ్డుపుల్లలు

చిత్తూరు ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు వేసి సొంత జిల్లా ప్రజలకూ వెన్నుపోటు

అధికారంలో ఉండగా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నిర్లిప్తత

వెలిగొండను గాలికొదిలేసి కమీషన్ల పైనే ఫోకస్‌.. అంచనాలు పెంపు

సీఎం జగన్‌ సారథ్యంలో రికార్డు సమయంలో వెలిగొండ మొదటి టన్నెల్‌ పూర్తి 

సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేలా సీఎం సంకల్పం

► 1996లో ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచి నీటి నిల్వను 66 నుంచి 129 టీఎంసీలకు పెంచేస్తుంటే చంద్రబాబు ప్రేక్షకపాత్ర వహించారు. నాడు సీఎంగా ఉన్న ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పటి ప్రధాని దేవెగౌడకు, కర్ణాటక సర్కార్‌కు తాకట్టు పెట్టేశారు.
► తెలంగాణ సర్కార్‌ 2015లో అక్రమంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ఎనిమిది ప్రాజెక్టులను చేపట్టి 178.93 టీఎంసీలను తరలిస్తుంటే నాటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టేశారు. వైఎస్సార్‌ ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండా అంచనాలు పెంచేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీళ్లందించేందుకు ఇప్పుడు సీఎం జగన్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు పనులను నిరసిస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో ఓ లేఖ రాయించారు. ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోసేందుకు కుట్రకు దిగారు.

ఆల్మట్టి ఎత్తు పెంపుతో దిగువకు వచ్చే వరద రోజులు తగ్గడం, ఒకేసారి గరిష్టంగా పోటెత్తడం, ఒడిసి పట్టేలా కాలువలు లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఈ జలాలతో దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను 2005లో వైఎస్సార్‌ చేపట్టారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం రాజకీయ ఉనికి కోసం ఆ పనులకు అడ్డుపడ్డారు. కోస్తాలో ప్రకాశం బ్యారేజీ వద్ద దేవినేని ఉమా, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో నాగం జనార్ధనరెడ్డితో ధర్నాలు చేయించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొన్నారు.

సాక్షి, అమరావతి: దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు... ప్రతి జిల్లాకూ మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న భగీరథ యత్నం ఫలిస్తే తన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళనతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు మరోసారి కుట్ర పన్నుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపును నిరసిస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయస్వామి, సాంబశివరావులతో లేఖ రాయించి మరోసారి తన నైజాన్ని బహిర్గతం చేసుకున్నారు.

దివంగత వైఎస్సార్‌ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన వాటిని ఐదేళ్లలో పూర్తిచేయకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడకు తెరతీసినట్లు సాగునీటి నిపుణులు చెబుతున్నారు. వెలిగొండలో ఇప్పటికే మొదటి సొరంగాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండో సొరంగాన్ని కూడా పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే జలాలను సోమశిల నుంచి నార్త్‌ ఫీడర్‌ చానల్‌ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా దుర్భిక్ష ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు జలాశయాన్ని వేగంగా నింపే పనులను రూ.650 కోట్లతో సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు. వాటి నుంచి ప్రజల దష్టి మరల్చడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఉనికి చాటుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారనేది నిపుణుల మాట.

చిత్తూరు జిల్లాలో 1500 అడుగుల లోతుకు వెళితే గానీ బోర్లుకూడా పడని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన పశ్చిమ మండలాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చెరువులను సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులుగా మారిస్తే... వాటిని రిజర్వాయర్లుగా చిత్రీకరిస్తూ, నిలిపివేయాలని ఎన్జీటీలో టీడీపీ నేతలతో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుదని వారు గుర్తు చేస్తున్నారు. సొంత జిల్లా ప్రజలకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తాజాగా వెలిగొండ ప్రాజెక్టుకు కూడా అడ్డుపడుతున్నారనేది పరిశీలకుల మాట.

వెలిగొండతో ప్రకాశం సస్యశ్యామలం...
శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే 43.5 టీఎంసీలను తరలించి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షలు, నెల్లూరు జిల్లాలో 84 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లాలో 27,200 వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో దివంగత వైఎస్సార్‌ 2004లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 నాటికే అధిక శాతం పనులను కొలిక్కి తెచ్చారు. మొదటి సొరంగంలో 3.8 కి.మీ, రెండో సొరంగంలో 8.037 కి.మీ. పనులు మాత్రమే మిగిలాయి. అయితే, 2015లో వాటిని సత్వరమే పూర్తిచేసే ముసుగులో రూ.66.44 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించేసిన చంద్రబాబు కమీషన్ల రూపంలో వాటిని వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత రెండు సొరంగాల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దుచేసి అంచనాలు పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు.

మొదటి సొరంగంలో 600 మీటర్లు అంటే.. ఐదేళ్లలో రోజుకు అడుగు చొప్పున, రెండో సొరంగంలో కేవలం 416 మీటర్ల పనులతో సరిపుచ్చి చేతులెత్తేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి ఖజానాకు రూ.61.76 కోట్లను ఆదా చేసి బాబు సర్కారు అక్రమాలను బహిర్గతం చేశారు. మొదటి సొరంగం పనులను రోజుకు 9.23 మీటర్ల చొప్పున యుద్ధప్రాతిపదికన చేసి జనవరి 13 నాటికి పూర్తిచేశారు. రికార్డు సృష్టించారు. రెండో సొరంగం పనులనూ వేగవంతం చేశారు. నల్లమల రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,511 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఏకంగా రూ.1,411.56 కోట్లను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు చేపట్టారు. 

హక్కులను పరిరక్షిస్తున్న సీఎం జగన్‌
విభజన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ... నాగార్జునసాగర్‌ను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించాలని కేంద్రం పేర్కొంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుతో తెలంగాణ సర్కార్‌ స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ సర్కార్‌ తన స్వాధీనంలోనే ఉంచుకుంది. సాగర్‌ కుడి కాలువకు కష్ణా బోర్డు కేటాయించిన నీటిని తెలంగాణ సర్కార్‌ ఫిబ్రవరి 12, 2015న అర్థాంతరంగా ఆపేయడంతో మరుసటి రోజు.. నాడు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌దాస్‌ పోలీసు బలగాలతో సాగర్‌ వద్దకు వెళ్లారు.

అయితే, ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి సాగర్‌ కుడి కాలువపై ఆధారపడిన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల హక్కులను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోకుండానే అధికారులను వెనక్కి రప్పించారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించాక 2019–20, 2020–21లో కేటాయించిన దానికంటే అధికంగా నీటిని విడుదల చేయించడం ద్వారా రాష్ట్ర హక్కులను పరిరక్షించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

బీడు భూములు పచ్చబడుతుండంతో..
గత రెండేళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు, వరద నీటిని ఒడిసి పట్టి మళ్లించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా బీడు భూములు పచ్చబడుతున్నాయి. పంటలు బాగా పండటం, గిట్టుబాటు ధరలు దక్కవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కరువన్నదే ఎరుగని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సీఎం వైఎస్‌ జగన్‌ భారీఎత్తున ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను రూ.5వేల కోట్లతో చేపట్టిన వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్‌ కుడి కాలువలోకి పోసి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆయకట్టును స్థిరీకరించడానికి, దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయడానికి చర్యలు చేపట్టారు. దీనికోసం రూ.1,200 కోట్లకు రాష్ట్ర ఖజానా నుంచి ఇప్పటికే ఖర్చు చేశారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వరికపుడిశెల ఎత్తిపోతల పనులు వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. సముద్రంలో వృథాగా కలిసే వరదను ఒడిసి పట్టడానికి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచే పనులను చేపట్టారు. ఇవన్నీ బాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయని, ఈ సమతుల అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2005 తరహాలో ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే దుస్సాహసానికి ఒడిగట్టారని, రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపువల్ల ప్రకాశం జిల్లా ప్రయోజనాలను దెబ్బతింటాయని దుష్ప్రచారం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖ రాయించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు