ఎనిమిది మంది ప్రాణాలు పోయినా.. చంద్రబాబు మారలా

31 Dec, 2022 08:41 IST|Sakshi
చంద్రబాబు సభకు వచ్చిన చిన్నారులు   

ఇరుకు రోడ్లు.. డ్రోన్‌షూట్‌లు 

నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన తీరు ఇదే..  

కందుకూరు, కావలి, కోవూరుల్లో అదే సీన్‌.. కందుకూరు ఘటనతోనైనా పద్ధతి మార్చుకోని టీడీపీ  

సాక్షి, నెల్లూరు/కోవూరు: అసలే ఇరుకు సందులు.. వాటిలో పదడుగుల ఫ్లెక్సీలు.. గట్టిగా వెయ్యిమంది వస్తే రోడ్డు కిక్కిరిసినట్టు కనిపించేలా డ్రోన్‌షూట్‌.. చివరికి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు కోల్పోవడం.. ఇదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనల సారాంశం. మూడురోజుల పర్యటనలో టీడీపీ నేతలు ఒకే ఫార్ములా అనుసరించారు. ఫలితంగా బుధవారం కందుకూరులో ఎనిమిదిమంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయినా మార్పురాలేదు. కందుకూరు ఘటనతోనైనా చంద్రబాబు సభలు విశాలమైన ప్రదేశాల్లో పెట్టకుంటారేమోనని అందరూ ఊహించారు. కానీ ఎక్కడా ప్రచారయావ తగ్గించుకునేది లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహారశైలి సాగింది. 

కావలిలో: కావలిలో గురువారం పొట్టి శ్రీరాములు జంక్షన్‌ వద్ద కూడా ఇరుకురోడ్లను ఎంచుకుని ఇదే ఫార్ములాతో సభ నిర్వహించారు. అక్కడ కూడా రెండు వైపులా 30 అడుగుల రోడ్లు, డ్రైనేజీ కాలువ, పదడుగుల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచార వాహనాన్ని సెంటర్‌లో ఉంచి ప్రసంగించారు.  

కోవూరులో: ఇరుకురోడ్ల ఫార్ములాను అమలు చేస్తున్న చంద్రబాబు అండ్‌ టీం శుక్రవారం కోవూరులో కూడా అదే తరహా పబ్లిసిటీ కోసం బజార్‌సెంటర్‌ లాంటి చిన్న జంక్షన్‌లో సభ నిర్వహించింది. కూడలి అయినప్పటికీ నాలుగు వైపులా రోడ్డు ఇరుగ్గా ఉంటుంది. వందమంది గుమిగూడితే ఇరుకైపోతుంది. అలాంటి ప్రదేశాన్ని టీడీపీ నేతలు ఎంచుకోవడం చూస్తే వారి పబ్లిసిటీ యావ ఎంతదూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సభకు వస్తే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తామంటూ నేతలు జనసమీకరణ చేపట్టినా.. కోవూరు బైపాస్‌ రోడ్డు సాయిబాబా మందిర కూడలి నుంచి బజారు సెంటరు దాకా చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోలో జనం పలుచగానే కనిపించారు. 

చదవండి: (జనాలు ఛీ కొడుతున్నా చంద్రబాబుకు పట్టింపుల్లేవు.. ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌)

మరిన్ని వార్తలు