వస్తు రవాణాలో ‘ఈ–వే’ దూకుడు 

25 Aug, 2020 03:52 IST|Sakshi

దేశవ్యాప్తంగా 131 కోట్ల ఈ–వే బిల్లుల జారీ 

ఇందులో 40 శాతం అంతర్‌ రాష్ట్ర రవాణాకు సంబంధించినవే 

చిన్న వ్యాపారుల సౌలభ్యానికి జీఎస్టీలో మార్పులు 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ 

సాక్షి, అమరావతి:  దేశంలో ‘ఈ–వే’ బిల్లింగ్‌ సంఖ్య క్రమేపీ పెరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 131 కోట్ల ఈ–వే బిల్లులు జారీ అయ్యాయని, ఇందులో 40 శాతం అంతర్‌ రాష్ట్ర వస్తు రవాణాకు సంబంధించినవేనని పేర్కొన్నారు. ఫిబ్రవరి 29న ఒకే రోజు 25,19,208 ఈ–వే బిల్లులు జారీ అయినట్టు వివరించారు. నిర్మలా సీతారామన్‌ తన ట్వీట్‌ ద్వారా ఇంకా చెప్పారంటే.. 

వడ్డీ రేట్ల తగ్గింపు.. లేట్‌ ఫీజుల ఎత్తివేత 
► కోవిడ్‌ తర్వాత పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించేలా సడలింపులిచ్చాం. వాయిదా విధానంలో చెల్లింపులు, వడ్డీ రేట్ల తగ్గింపు, లేట్‌ ఫీజులు ఎత్తివేత, కొన్ని కేసుల్లో లేటు ఫీజును రూ.500కి పరిమితం చేశాం. రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ గల చిన్న పన్ను చెల్లింపుదారులు 2020 సెప్టెంబర్‌ 30 లోగా జీఎస్టీ ఆర్‌–3బీ రిటర్న్‌ దాఖలుకు లేట్‌ ఫైలింగ్‌పై వడ్డీ సగానికి తగ్గించి 9%గా ప్రకటించాం. 
► చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో జీఎస్టీ వార్షిక రిటర్నుల విధానాన్ని సరళీకృతం చేశాం. 
► 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు రూ.2 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న వ్యాపార సంస్థలకు రిటర్న్స్‌దాఖలును ఆప్షనల్‌ చేశాం. 
► రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం ద్వారా ‘నిల్‌’ రిటరŠన్స్‌ దాఖలు చేసే విధానం ప్రవేశ పెట్టబడింది. దీనివల్ల సుమారు 22 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. 
► 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి కాంపోజిషన్‌ స్కీమ్‌ను రూ.50 లక్షలకు విస్తరించడమే కాకుండా ఈ స్కీమ్‌ వర్తించే పన్ను చెల్లింపుదారులు 3 నెలలకు ఒకసారి కాకుండా ఏడాదికి ఒకసారే రిటర్నులు దాఖలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం.  

మరిన్ని వార్తలు