అమరావతి భూ కుంభకోణం కేసులో కీలకసాక్షిగా చెరుకూరి శ్రీధర్‌

4 Jul, 2021 14:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో చెరుకూరి శ్రీధర్‌ కీలకసాక్షిగా మారుతున్నారు. కాగా ఆదివారం ఏపీ సీఐడీ అధికారులు శ్రీధర్‌ను విచారించగా రెవెన్యూ రికార్డుల మాయంపై వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. '' 2015లో ల్యాండ్‌ పూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారు. తిరిగి ఒరిజినల్స్‌ను తుళ్లూరు ఎమ్మార్వోకు ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని గుంటూరు కలెక్టరేట్‌లోనే ఉంచారు.  అనంతరం ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వం రాజధాని నగర పరిధిని నిర్ణయించడం కోసం సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌.. గుంటూరు కలెక్టర్‌, గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం నిర్వహించారు. 

2015 జనవరిలో ల్యాండ్‌ పూలింగ్‌ పథకం ప్రక్రియ పారంభమైంది. అసైన్డ్‌ భూముల సేకరణపై జీవో 41ని తీసుకొచ్చారు. మాజీమంత్రి నారాయణ పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది. ఏపీ అసైన్డ్‌ లాండ్‌ యాక్ట్‌ 1977కి విరుద్ధంగా ఉన్న అంశాలను.. మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లా.  చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదు. జీవో జారీకి ముందే కొన్ని ప్రతిపాదనలు.. చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణకు తెలిపా.అధికారులు నిర్ణయాధికారులు కాదు.. మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న ఇతర అధికారులు మాత్రమే.. నిర్ణయాలను అమలు చేస్తారని మంత్రి నారాయణ అన్నారు.  ఆ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగింది.'' అని తెలిపారు. కాగా విచారణలో కీలక విషయాలు బయటపెట్టడంతో  మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తుంది. హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ సీఐడీ కౌంటర్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు