సొంత నిధులతో 150 ఆక్సిజన్‌ బెడ్లు

28 Apr, 2021 04:32 IST|Sakshi
నారావారిపల్లి సీహెచ్‌సీలోని ఆక్సిజన్‌ సిలిండర్‌ను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా వీసీ హరికృష్ణ

ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి తుడా: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్‌–19 మహమ్మారిని కట్టడి చేసేందుకు, ప్రజలను రక్షించుకునేందుకు నడుం బిగించారు. రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నారావారి పల్లె పీహెచ్‌సీని, చంద్రగిరి ఏరియా ఆస్పత్రిని అధికారులతో కలిసి సందర్శించిన ఆయన తుడా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి కోవిడ్‌ సెంటర్‌లో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పద్మావతి నిలయంలో వెయ్యి మంది కరోనా బాధితులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. చంద్రగిరికి సమీపంలో మరో 500 మంది కరోనా బాధితులకు సౌకర్యవంతంగా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్‌ కొనుగోలుకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని తానే సొంతంగా భరించనున్నటేకట ప్రకటించారు.

చంద్రగిరి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యంతో 100 పడకలు, నారావారి పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల బెడ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా, హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండే వారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లను ముందస్తుగా సిద్ధం చేశామని చెవిరెడ్డి చెప్పారు. కరోనా బాధితులకు టెలీ మెడిసిన్, టెలీ కాన్ఫరెన్స్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏడు కోవిడ్‌ మెడికల్‌ షాప్‌లు, ఏడు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు