బాబు మరో జన్మెత్తినా వైవీ కుటుంబానికి సాటిరారు

19 Sep, 2020 10:26 IST|Sakshi
చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

శ్రీ వారికి ప్రథమ సేవకుడే కాదు.. ప్రధాన భక్తుడు 

చంద్రబాబు కుటుంబం ఎన్ని జన్మలెత్తినా.. వైవీకి  భక్తిలో సాటి రాదు 

12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు సందర్శించిన మహా భక్తుడు 

చంద్రబాబు ఆలోచన ధోరణి మారాలి 

ప్రతిపక్షనేత వ్యాఖ్యలపై చెవిరెడ్డి మండిపాటు 

సాక్షి, తిరుపతి: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి సేవకుడే కాక.. వెంకన్నకు ప్రధాన భక్తుడని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనియాడారు. ఆయన జంద్యం వేసుకోని సద్‌బ్రాహ్మణుడన్నారు. వైవీ సుబ్బారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై చెవిరెడ్డి మండిపడ్డారు. ఆ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 
నిష్ట, నియమాలతో 36 సార్లు, 41 రోజుల పాటు అయ్యప్ప మాల వేసి, శబరిమలైకి వెళ్లిన భక్తుడు సుబ్బారెడ్డి. ప్రతిరోజు గోపూజ చేయకుండా ఇంట్లో నుంచి బయటికి రారు.  
ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు భగవంతునికి పూజ చేయకుండా ఏ పనికీ వెళ్లారు. నిత్యం మెడలో రుద్రాక్షతో ఉండే వ్యక్తి. ఇప్పటికే 12 జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ పీఠాలను దర్శించారు. అమరనాథ్, మానస సరోవరం సైతం అనేక సార్లు దర్శించిన మహా భక్తుడు. 
ప్రతిరోజు ఇంట్లో మనుసూక్తం, నమకం, ఛమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తాలతో పాటు అభిషేకాలు చేస్తున్న కుటుంబం ఆయనది. ఇప్పటికే ఆయన తన ఇంట్లో కోటిసార్లు లలిత సహస్రనామం, కోటిసార్లు విష్ణుసహస్రనామ పారాయణం చేయించారు. లోకకల్యాణం కోసం సహస్ర చండీయాగం, శత చండీయాగం సైతం చేసిన కుటుంబం వైవీ సుబ్బారెడ్డిది.   (చరిత్రకు ఆనవాళ్లుగా పురాతన కట్టడాలు)
40 సంవత్సరాలుగా దేశంలో జరిగిన ప్రతి పుష్కారాలకు,  కుంభమేళాలకు వెళ్లి స్నానమాచరించారు. 37 సంవత్సరాలకు ముందు తన పెళ్లి శ్రీవారి చెంతనే చేసుకున్నారు. తన ఏకైక కుమారుడి వివాహం హైదరాబాద్‌లో చేసినా నూతన దంపతులిద్దరినీ పెళ్లి దుస్తులతో అక్కడి నుంచి తిరుమలకు తీసుకువచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. 
ఆయన కొడుకు, కోడలు ఇప్పటికీ తిరుమలకు పాదయాత్రగానే చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆయన తన మనువడికి సైతం ఊహ తెలిసిన నాటి నుంచి ప్రతి రోజు గోపూజ చేయడం, భగవంతుడిని ప్రార్థించడం నేర్పించిన భక్తుడు. 
తిరుమల శ్రీవారిపై ఉన్న లక్ష్మీహారం, తిరుచానూరులో ఉన్న అమ్మవారి కాసుల దండ భక్తితో గతంలోనే వైవీ సుబ్బారెడ్డి సమర్పించారు. శ్రీశైలం మల్లికార్జునస్వామికి అప్పట్లోనే 300 బంగారు పూలు సమర్పించారు. హిందూ పీఠాధిపతులు చేసే మత ప్రచారాలు, పూజలకు మద్దతుగా నిలిచిన వ్యక్తి వైవీ. ఈ విషయం ఏ పీఠాధిపతిని వాకబు చేసినా తెలుస్తుంది. 
సద్‌బ్రాహ్మణుడితో సమానంగా భగవంతునిపై భక్తి, భయం, శ్రద్ధ, నిష్ట కలిగిన సుబ్బారెడ్డి వంటి పరమభక్తుడిపై చంద్రబాబు విమర్శలు చేయడం బాధాకరం. 
వైవీ కుటుంబానికి భక్తిలో చంద్రబాబు కుటుంబం మరో జన్మ ఎత్తినా సాటిరాదు.    

>
మరిన్ని వార్తలు