‘సాక్షి’ చూస్తూ ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశా తయారీ..

21 Aug, 2020 14:28 IST|Sakshi

వినాయక చవితి.. ఈ పేరు వినగానే ఎక్కడలేని ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఊరు వాడా మొత్తం అసలైన పండగ వాతావరణం నెలకొంటుంది. గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కాకముందే ప్రతి వీధిలో మండపాల ఏర్పాటు, విగ్రహ కొనుగోలు వంటి పనులతో బిజీగా ఉంటుంది. అయితే ఈ ఏడు వినాయక చవితికి ఈ హంగామా అంతా కనిపించేలా లేదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేనట్లు తెలుస్తోంది. గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినిపించేలా లేవు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేనట్లు స్పష్టం చేసింది. ఇళ్లలోనే కరోనా నియమాలు పాటిస్తూ ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు)

మచిలిపట్నం : ఈ క్రమంలో ‘సాక్షి’ టీవీలో మట్టి వినాయకుడిని ఎలా తయారు చేయాలో వివరించడాన్ని చూస్తూ మచిలిపట్నంలోని చిన్నారులు ఇంట్లోనే మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడి ప్రతిమను చిన్నారులు తమ చిట్టి చిట్టి చేతులతో తయారు చేసేందుకు పూనుకున్నారు. అయితే ఈ ఏడాది పర్యావరణహిత గణేశ విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతీక అయిన వినాయక చవితి పండగను జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఏకో ప్రెండ్లీ గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిద్దాం. (‘ఎకో’దంతుడికి జై!)

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో పరిసరాలు మరింత కాల్యుష్యం అయ్యే అవకాశం ఉన్నందున మట్టి గణపతికి భక్తులు జై అంటున్నారు. దీంతో ఎకో ఫ్రెండ్లీ విత్తన వినాయకుడిని రూపొందించి పూజించాలనే ఈ ఏడు ప్రచారం కొనసాగుతోంది. పర్యావరణ స్నేహపూర్వక గణేష్‌ విగ్రహాలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నాయి. ఇంతక ముందు కేవలం బంకమట్టి, సహజ రంగులతో తయారు చేసేవి. కానీ ఇప్పుడు మట్టి లోపల వివిధ చెట్ల గింజలతో రానున్నాయి. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆకు పచ్చ కవచాన్ని పెంచే విధంగా గణేష్‌ పండుగను జరుపుకునేందుకు ప్రజలు సంకల్పించారు. (‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’)

మరిన్ని వార్తలు