టెన్త్‌ పరీక్షలపై రేపు సీఎం జగన్‌ కీలక నిర్ణయం: చినవీరభద్రుడు

16 Jun, 2021 18:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: టెన్త్‌ పరీక్షలపై రేపు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో జులై 26 నుంచి ఆగస్ట్ రెండు వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు.

ఈ పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని, వారి కోసం 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. ఈ సారి 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా సూచిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు వెలువడేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయగా, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందని అదే క్రమంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.

చదవండి: జూన్‌ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు