అన్నదాతల ఆదాయం రెట్టింపే లక్ష్యం

5 Dec, 2021 05:23 IST|Sakshi
రవీంద్రప్రసాద్‌ తోటలో గోవా రకం జామ కాయలను పరిశీలిస్తున్న నాబార్డు చైర్మన్‌

వ్యవసాయ రుణాలు, పరికరాలకు రూ.2.40 లక్షల కోట్లు

ఎఫ్‌పీవోలకు రూ.1,200 కోట్లు కేటాయించాం

నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు వెల్లడి   

శృంగవరపుకోట రూరల్‌: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు తెలిపారు. వ్యవసాయ రుణాలు, పరికరాల కొనుగోళ్ల కోసం నాబార్డు నుంచి రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నాబ్‌ కిసాన్‌–నాబ్‌ సంరక్షణ్‌లో భాగంగా ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌పీవో)లకు క్రెడిట్‌ గ్యారంటీ కింద రూ.1,200 కోట్లు కేటాయించామన్నారు. ఎఫ్‌పీవోలకు రుణాలిచ్చే బ్యాంకులకు ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొడ్డవర గ్రామంలో సేంద్రియ రైతు ఎం.రవీంద్రప్రసాద్‌ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌పీవోల కింద రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో 340 ఎఫ్‌పీవోలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు కాండ్రేగుల సన్యాసినాయుడు, చెల్లయ్య, కె.జయవిష్ణు తదితరులతో నాబార్డు చైర్మన్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నాబార్డు సీజీఎం జె.సుధీర్‌కుమార్, జీఎం ఎన్‌ఎస్‌ మూర్తి, డీజీఎం నాగేష్, ఏజీఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు