టీడీపీ నేతపై కేసు: ఏసీలు కొన్నాడు.. రుణం తీర్చనన్నాడు! 

13 Dec, 2021 11:57 IST|Sakshi

టీడీపీ నాయకుడి హేమాద్రి నాయుడిపై కేసు నమోదు   

సాక్షి, చిత్తూరు: ఓ ఫైనాన్స్‌ సంస్థ రుణంతో ఏసీలు కొని, బకాయిలు కట్టనందుకు టీడీపీ మండల అధికార ప్రతినిధి హేమాద్రినాయుడుపై కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. రామభద్రాపురం గ్రామానికి చెందిన హేమాద్రినాయుడు అతని భార్య హరిణి పేరున బజాజ్‌ఫైనాన్స్‌లో 2020 జనవరి 8వ తేదీన రెండు ఏసీలు కొన్నారు. రెండు ఏసీలకు గాను రూ.1,04 లక్షలు కట్టాల్సి ఉంది.

ఇందులో రూ.34,660 డౌన్‌ పేమెంట్‌ కింద బజాజ్‌ఫైనాన్స్‌కు కట్టారు. మిగిలిన మొత్తం బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ రుణంతో, చిత్తూరులోని రిలైన్స్‌ మార్ట్‌లో రెండు ఏసీలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను ప్రతినెలా రూ.8,700 ఈఎంఐ కట్టాల్సి ఉంది. సెప్టెంబర్‌ నెలకు ఈఎంఐ కట్టలేదు. ఇందుకుగాను చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న బజాజ్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ సురేష్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో ఆదివారం రామభద్రాపురంలోని హేమాద్రినాయుడు ఇంటికి కలెక్షన్‌ ఏజెంట్‌ పద్మనాభన్‌తో పాటు వచ్చారు.

దీంతో ఆగ్రహించిన హేమాద్రినాయుడు తన ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం..రా అంటూ అతన్ని దుర్భాషలాడుతూ అతనిపై చేయి చేసుకొన్నారు. ‘గుడిపాల మండలం తెలుగుదేశం నాయకుడ్ని నేను, ఫోన్‌ చేస్తే 200 మంది ఇప్పుడే వస్తారు, నీ కథ తెలుస్తా.’ అంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీ సర్పంచ్‌గా హేమాద్రినాయుడు భార్య హరిణి ప్రస్తుతం పనిచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు