ఈ సైకిల్‌.. స్పీడ్‌ 80 మైలేజీ 90 

2 Mar, 2021 03:23 IST|Sakshi

సాక్షి, చిత్తూరు‌: కాలుష్య నివారణకు ఉపయోగపడే ఈ (ఎలక్ట్రిక్‌ ) బైసైకిల్‌ను సొంతంగా రూపొందించారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి అమర్‌నాథ్‌. దామలచెరువు మండలానికి చెందిన కృష్ణమూర్తి, షకీల దంపతుల కుమారుడు అమర్‌నాథ్‌ సిక్కిం నీట్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తను ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. రూ.80 వేలు వెచ్చించి పర్యావరణహిత ఈ–బైసైకిల్‌ను తయారు చేశారు. దీని వివరాలను అమర్‌నాథ్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు. మొదట గేర్‌ సైకిల్‌ను కొనుగోలు చేసి, గేర్లు తొలగించానన్నారు. ఆన్‌లైన్‌లో పలు వెబ్‌సైట్లు, కంపెనీల నుంచి విడిభాగాలు, బ్యాటరీ కోనుగోలు చేశానన్నారు. మొదటిసారి ప్రయోగం కాబట్టి ఖర్చు ఎక్కువ అయిందని, కంపెనీలు సహకారం అందిస్తే మరింత తక్కువ ధరకే వినియోగదారులకు వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. 

ఈ బైసైకిల్‌ ప్రత్యేకతలు.. 
►మోటార్‌కు 72 వాట్స్‌ డీసీ పవర్‌ చార్జింగ్‌ కనెక్షన్‌ 
►గంటకు 80 కిలోమీటర్ల వేగం 
►రెండు గంటలు చార్జింగ్‌ చేస్తే 90 కిలోమీటర్లు నడుస్తుంది 
►బ్యాటరీ చార్జింగ్‌ అయిపోతే ఫెడల్‌ సాయంతో తొక్కే సౌలభ్యం  

మరిన్ని వార్తలు