37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు!

1 Dec, 2020 13:11 IST|Sakshi

ఓ నిరుపేద ఆవేదన..

ఆదుకోవాలని వినతి

సాక్షి, బైరెడ్డిపల్లె(చిత్తూరు జిల్లా): ఎవరినైనా ఒకసారో.. రెండుసార్లో పాము కాటేయడం సహజం.. అయితే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(42)ను ఏకంగా 37 సార్లు కాటేయడం విచిత్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సుబ్రమణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారి పొలం వద్ద పాము కాటేసింది. అప్పటి నుంచి పాములు పగబట్టినట్లుగా సుబ్రమణ్యంను వెంటాడుతూ ప్రతి ఏటా ఓ సారి కాటేస్తున్నాయి.

37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తుండడం విశేషం. ఒకసారి పాము కాటేసిందంటే కనీసం 10 రోజులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు చికిత్స కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోందని వాపోతున్నాడు. రెక్కాడితేగానీ డొక్కాడని సుబ్రమణ్యంను నాలుగు రోజుల క్రితం మళ్లీ పాము కాటు వేయడంతో శంకర్రాయలపేటలోని జేఎంజే ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన దీనావస్థను గుర్తించి దాతలు, ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. (విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి..)

మరిన్ని వార్తలు