కుప్పంలో విగ్రహాల ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు

7 Apr, 2021 13:38 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాల ధ్వంసం ఘటనను పోలీసులు ఛేదించారు. కుప్పం మండలం గోనుగురు సమీపంలోని దేవతామూర్తుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ  విగ్రహాలు ధ్వంసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని తేలిందన్నారు.

విగ్రహాల ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుందన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే సమయంలో మహిళ మద్యం మత్తులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, పోలీసులు, పీస్‌ కమిటీకి వెంటనే తెలియజేయాలని తెలిపారు.

చదవండి: అడుగడుగునా మేసేశారు

మరిన్ని వార్తలు