జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు తగదు

26 May, 2021 05:53 IST|Sakshi

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులపై చర్యలు  

సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీ పీవీ సునీల్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలోనూ ఇలాంటి పోస్టులపై హైకోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టామని సునీల్‌ కుమార్‌ గుర్తు చేశారు.  

నాలుగు రోజుల నుంచి న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లను గుర్తించామని, వాటిపై లోతైన దర్యాప్తు చేపట్టామని సునీల్‌ కుమార్‌ తెలిపారు. ఇదంతా కొందరు పథకం ప్రకారం చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని, కొందరు కావాలనే న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చామన్నారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ సోషల్‌ మీడియా వింగ్, ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ టీమ్‌లు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు.     

మరిన్ని వార్తలు