రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ

15 May, 2021 11:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. 

ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేష్టలు ఉన్నాయని తెలిపింది. కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని, టీవీ5, ABNతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొంది. టీవీ5, ఏబీఎన్‌ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషంజిమ్మించాయని సీఐడీ తెలిపింది. 

పక్కా పథకం ప్రకారమే రఘురామ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ 12/2021లో రఘురామ, TV5, ABN కుట్రను సవివరంగా సీఐడీ పేర్కొంది. రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచినందుకు CRPC 124 (A) సెక్షన్‌, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు 120 (B) IPC సెక్షన్‌, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ
 

మరిన్ని వార్తలు