శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్‌ భార్య ఆత్మహత్య

18 Jan, 2023 11:05 IST|Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీహరికోటలో మరో విషాదం నెలకొంది. సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ వికాస్‌ సింగ్‌ భార్య ప్రియా సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన వికాస్‌సింగ్‌ని చూసేందుకు.. భార్య ప్రియా సింగ్‌ ఉత్తర ప్రదేశ్‌ నుంచి షార్‌కు వచ్చారు. విగతజీవిగా పడిఉన్న భర్తను చూసి మనస్తాపంతో షార్‌లోని నర్మదా అతిథి గృహంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వికాస్‌సింగ్‌ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి, తండ్రి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.

కాగా, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో 24 గంటలో వ్యవధిలోనే సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ వికాస్‌సింగ్‌, కానిస్టేబుల్‌ చింతామణి​ ఆత్మహత్య చేసుకున్నారు. షార్‌ మొదటిగేటు వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌సింగ్‌ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకు­న్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్‌ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్‌ రాడార్‌ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆది­వారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్‌ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మహషముండ్‌ జిల్లా శంకర విలేజ్‌ అండ్‌ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.

చదవండి: (షార్‌లో విషాదం.. సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య)

>
మరిన్ని వార్తలు