సంతోషంగా ఉంది.. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం: సీజేఐ ఎన్వీ రమణ, సీఎం జగన్‌

20 Aug, 2022 11:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ (సీజేఐ ఎన్వీ రమణను ఉద్దేశించి)..  ఇవాళ ఒక ఉన్నతస్థాయిలో ఇక్కడి కోర్టు భవనాన్ని ప్రారంభించడం.. రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగించారు. 

2013లో జస్టిస్‌ ఎన్వీ రమణగారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం అని సీఎం జగన్‌ తెలిపారు. జ్యూడీషియరీకి సంబంధించి ప్రతీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.


 
అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. 

రాష్ట్ర ముఖ్యమంత్రిగారు తెలుగులో మాట్లాడాక.. తాను తెలుగులో మాట్లాడకపోవడం బాగోదని చెప్తూ తెలుగులోనే ప్రసంగించారు జస్టిస్‌ ఎన్వీ రమణ.

నేను శంకుస్థాపన చేసిన బిల్డింగ్‌ను.. మళ్లీ నేనే ప్రారంభించడం ఆనందంగా ఉంది. రకరకాల కారణాలతో ఈ నిర్మాణం ఆలస్యమైంది. న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేక వచ్చినప్పుడు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రులకు( ఏపీ సీఎం జగన్‌ కూడా) కృతజ్ఞతలు. పెండింగ్‌ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. విభజన అనంతరం ఏపీ ఆర్థికంగా వెనకబడిందన్న సీజేఐ.. విభజనతో నష్టపోయామన్న భావన ఏపీ ప్రజల్లో ఉందని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు.

నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో జడ్జి ల ఖాళీలను భర్తీ చేసాను. 250 మంది హైకోర్టు జడ్జి లను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జి లను నియమించగలిగాను. సీఎం వై ఎస్ జగన్ సహకారం వల్లనే ఇప్పుడు ఈ భవనం పూర్తి చేసుకోగలిగాం. విశాఖపట్నం లో కూడా ఓ భవనం చివరి దశలో ఉంది. దానితో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నాం అని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ చదవండి: ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..

మరిన్ని వార్తలు