శుభ్రం.. సుందరం

5 Jun, 2023 03:22 IST|Sakshi

 సత్ఫలితాలు ఇచ్చిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌

సాక్షి, అమరావతి : పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేపట్టిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణ మెరుగుపడి పట్టణాలు పరిశుభ్రంగా మారడానికి దోహదపడింది.

గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని రెండేళ్ల కిందట విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమం కింద 4,097 చెత్త సేకరణ వాహనాలను కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు అందించారు. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్లాప్‌ కార్యక్రమంపై ప్రత్యేక కథనం..

నిర్వహణకు సిబ్బంది నియామకం... 
పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాల్లో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుప­యోగంగా మారాయి. ‘క్లాప్‌’లో భాగంగా ఈ కేంద్రా­ల వద్ద నలుగురు చొప్పున సిబ్బందిని నియ­మిస­్తు­న్నా­రు. కొత్తగా 4,171 ‘చెత్త నుంచి çసంపద’  కేంద్రాలను నిర్మించే దిశగా అడుగులు వేశారు. 

గ్రామాల్లో మూడు చక్రాల వాహనాల పంపిణీ
క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశారు. చెత్త సేకరణ–రవా­ణాను మరింత మెరుగుపరిచేందుకు వెయ్యి ఆటోలు సమకూర్చారు. వ్యర్థాలను తగిన ఉష్ణోగ్రతల వద్ద భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్‌ పరికరాలను కూడా పంపిణీ చేశారు. ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్లు కేటాయించారు.

దోమల నివారణకు 10,628 థర్మల్‌ ఫాగింగ్‌ మిషన్లు అందించారు. అదేవిధంగా 135 మేజర్‌ పంచాయతీల్లో సమగ్ర ద్రవ వ్యర్థాల నిర్వహణకు, 10,645 పంచాయతీల్లో వర్మి కంపోస్ట్‌ నిర్వ­హణకు, నాన్‌ రీసైక్లింగ్‌ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీలు, సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. వీటన్నింటి ఫలితంగా క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం నెరవేరుతోంది. ఈ కార్యక్రమం విజయ­వంతమై మన పరిసరాలు, పర్యావరణం పరిశుభ్రంగా ఉండేందుకు దోహదపడింది.  

1.20 కోట్ల డస్ట్‌ బిన్‌ల పంపిణీ 
క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్‌కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్‌ వస్తువులు) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్‌ బిన్‌లు చొప్పున మున్సిపా­లిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్‌లు, మున్సిపాలి­టీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లు అందజేసింది. ఇందుకు రూ.100 కోట్ల నిధులను వినియోగించింది.

జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,500 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించింది. మరింత మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్‌ ఆటోలను సైతం సమకూర్చింది. అదేవిధంగా ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్‌ ఆధారిత గార్బేజ్‌ టిప్పర్ల ద్వారా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లకు తరలిస్తున్నా­రు.

మరోవైపు 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 231 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌(జీటీఎస్‌)లు ఏర్పాటు చేయడంతోపాటు 72 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు చర్యలు తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన 32 మున్సిపాలి­టీల్లోని డంప్‌ సైట్‌లలో వ్యర్థాల నిర్మూల­న­కు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని 65 నాన్‌ అమృత్‌ సిటీలలో సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎఫ్‌ఎస్‌టీపీ) ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు