టాప్‌ టెన్‌లో నిలవాలి

13 May, 2021 03:01 IST|Sakshi

మన యూనివర్సిటీలలో అత్యున్నత ప్రమాణాలుండాలి.. ఆ మేరకు కార్యాచరణ రూపొందించండి

ఉన్నత విద్యపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌    

ఆరు వర్సిటీలపై ప్రధానంగా దృష్టి

ఐఐటీల స్థాయిలో ట్రిపుల్‌ ఐటీలు ఉండాలి.. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం

ఆ దిశలోనే పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం

విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచాలి

కొత్త మెడికల్‌ కాలేజీల్లో 70% కన్వీనర్, 30% మేనేజ్‌మెంట్‌ కోటా 

తద్వారా పేద విద్యార్థులకు మరిన్ని సీట్లు.. కాలేజీలకు స్వయం సమృద్ధి 

ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్య, ఆరోగ్య సంస్థల్లో సంస్కరణల బిల్లులు

రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత విద్యను పటిష్టం చేస్తున్నాం. అమ్మ ఒడి, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌సీ సిలబస్, నాడు–నేడు పనులతో విద్యా రంగం రూపురేఖలనే మార్చేస్తున్నాం. అన్ని వసతుల మధ్య పిల్లలు విద్యనభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సందర్భంలో వర్సిటీ స్థాయిలో కూడా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలి. ఇందుకు దేశంలోని టాప్‌ 10 వర్సిటీల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలి. అవసరమైన వాటిని మన వర్సిటీల్లో అమలు చేయాలి. మన విశ్వవిద్యాలయాలు కూడా దేశంలోని టాప్‌ 10 జాబితాలో నిలిచేలా కార్యాచరణ రూపొందించాలి.  
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: యూనివర్సిటీలలో అన్ని ప్రమాణాలు పెరగాలని, దేశంలో టాప్‌ టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఐఐటీల స్థాయిలో ట్రిపుల్‌ ఐటీలుండాలని, అందుకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని చెప్పారు. ఉన్నత విద్య అభివృద్ధిలో భాగంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో యూనివర్సిటీలను మెరుగుపరచడంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశలోనే పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యా, ఆరోగ్య సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని, దీనిపై అధికారులు మూడు నాలుగు సార్లు సమావేశమై విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన బిల్లులను రూపొందించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీల్లో 70 శాతం సీట్లు కనీ్వనర్‌ కోటాలో, మిగిలిన 30 శాతం సీట్లు పేమెంట్‌ (మేనేజ్‌మెంట్‌) కోటాలో ఉండేలా ఆలోచన చేయాల్సిందిగా ఆదేశించారు. దీని వల్ల పేద విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయని, అంతే కాకుండా ప్రతి కాలేజీ స్వయం సమృద్ధితో నడుస్తుందని చెప్పారు. దీంతో నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ప్రమాణాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..      

 
ర్యాంకింగ్‌ ఇంకా మెరుగు పడాలి 

► జేఎన్టీయూ రెండు యూనివర్సిటీలు (కాకినాడ, అనంతపురం), ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు, ట్రిపుల్‌ ఐటీలను ఇప్పడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి తీసుకువెళ్లడంపై కార్యాచరణ రూపొందించండి.  
► ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ని నిధులు అవసరమో చెప్పండి. కడపలో రానున్న ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఏయూ ప్రస్తుతం 19వ స్థానంలో, ఎస్వీ యూనివర్సిటీ 38వ స్థానంలో ఉన్నాయి. రెండేళ్లలో వీటి స్థానాలు గణనీయంగా మెరుగు పడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టండి. 
 
ప్రతిభావంతుల ఎంపిక 

► ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఉత్తమ స్థానాల్లో ఉన్న యూనివర్సిటీలలో పద్ధతులను అధ్యయనం చేయండి. మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధ్దతులు, బోధనా సిబ్బంది తదితర అంశాల్లో ఆచరించాల్సిన పద్ధతులపై దృష్టి పెట్టండి.  
► ప్రతిభ ఉన్న వారినే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిగా నియమించాలి. ప్రతిభావంతులను ఎంపిక చేయడానికి తగిన చర్యలు తీసుకోండి. రిక్రూట్‌మెంట్‌ కోసం పటిష్టమైన పద్ధతులను రూపొందించండి. 
 
విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం 
► విదేశాల్లోని అత్యుత్తమ యూనివర్సిటీల పద్ధతులను, విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిని మన యూనిర్సిటీల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వారి పాఠ్య ప్రణాళికలను ఇక్కడ అనుసంధానం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలి. 
► బోధనతో పాటు కోర్సులకు సంబంధించి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోండి. 
 
ట్రిపుల్‌ ఐటీల్లో బిజినెస్‌ కోర్సులు 
► ట్రిపుల్‌ ఐటీల్లో ప్రస్తుతం 22,946 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్‌ ఐటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి రూ.180 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. 
► మళ్లీ ట్రిపుల్‌ ఐటీలు మెరుగు పడాలి. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలి. దీని కోసం కార్యాచరణ రూపొందించండి. ట్రిపుల్‌ ఐటీల్లో మంచి బిజినెస్‌ కోర్సులను ప్రవేశ పెట్టడంపైనా దృష్టి పెట్టండి. ఈ కోర్సులు అత్యుత్తమంగా ఉండాలి. ఇంజినీరింగ్‌ కోర్సులు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించేలా చూడాలి.  


 
విద్య, ఆరోగ్య వ్యవస్థలు బావుండాలి 
► రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 మెడికల్‌ కాలేజీలను తీసుకు వస్తున్నాం. మెడికల్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. ఆ కాలేజీలను మెరుగ్గా నిర్వహించడానికి చక్కటి విధానాలు పాటించాలి.  
► విద్యా, ఆరోగ్య వ్యవస్థ బాగు పడాలనే తపనతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అందు కోసం పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ సంస్థలన్నింటినీ అత్యుత్తమంగా నడుపుకునేలా చక్కటి విధానాలను తీసుకురావాలి.  
► గ్రామ సచివాలయాల సిబ్బందికి ఇచ్చే శిక్షణను ట్రిపుల్‌ ఐటీలతో కలిసి నిర్వహించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యాక్రమాలను కూడా ట్రిపుల్‌ ఐటీలు నిర్వహించాలి. 
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఆర్‌జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కెసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు