హోదాతో ఆదుకోండి.. ప్రధాని మోదీ ఎదుట మరోసారి ప్రస్తావన

21 Feb, 2021 04:31 IST|Sakshi
నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు

విభజన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది

నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటులో చెప్పారు

హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధి

పోలవరం ఖర్చులో సవరించిన అంచనాలు ఆమోదించాలి

పరస్పర సహకారం, సంప్రదింపులు, అర్థవంతమైన చర్చలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి 

భారత్‌ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలి

ఇందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందుబాటులో ఉండాలి

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై దృష్టి సారించాలి 

రాష్ట్రంలో 10,731 ఆర్బీకేల ఏర్పాటు 

10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు శ్రీకారం 

విద్య, ఆరోగ్య రంగాల్లో నాడు–నేడు 10 వేలకు పైగా విలేజ్‌ క్లినిక్స్

సాక్షి, అమరావతి: విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లగలదని పేర్కొన్నారు. విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తారని బేషరతుగా పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని సీఎం  ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ ఆరవ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం (వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా) ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగు నీటి రంగానికి ఎంతో అండగా నిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. కోవిడ్‌ కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించడానికి అవకాశాలన్నింటినీ పరిశీలించాలని, ఇందుకు అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించారు. భారత్‌ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనకు తీసుకున్న చర్యలను, చేపట్టిన సంస్కరణలను ప్రధానికి వివరించడంతో పాటు రాష్ట్రానికి పలు రంగాల్లో కేంద్ర సాయాన్ని కోరారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
 
ఐదు అవరోధాలను అధిగమించాలి
►భారత్‌ను ఉత్పత్తి, తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలన్న (మేకింగ్‌ ఇండియా ఎ గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌) లక్ష్య సాధనకు సంబంధించి చెప్పాలంటే.. తొలుత ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన దేశాలు అవలంబించిన విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. అన్ని వాస్తవాలను నిశితంగా విశ్లేషించుకోవాలి. 
►నా అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి, తయారీ రంగంలో భారత్‌ విజయానికి ఐదు రకాల అంశాలు అవరోధంగా మారాయి. అవేమిటంటే.. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్‌ ఖర్చులు అధికంగా ఉండడం, భూ సేకరణలో జాప్యం, అనుమతుల మంజూరులో సంక్లిష్టత, కఠినమైన కార్మిక చట్టాలు.
►వీటన్నింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చి ఉత్పత్తి, తయారీ రంగంలో ఉన్న అవరోధాల నుంచి గట్టెకాల్సి ఉంది. 

పనితీరు ఆధారంగా రాయితీలు 
►రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోంది. భారత్‌ను ఉత్పత్తి, తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి, కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు ‘పనితీరు ఆధారంగా రాయితీలు’ (పర్ఫార్మెన్స్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌)ను ప్రోత్సహిస్తోంది. 
►అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జిల్లా వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా 229 సంస్కరణలు అమలు చేస్తోంది.

ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ధి
►వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిగా సానుకూల పరిస్థితులు కల్పించడంతో పాటు, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది.     
►ముఖ్యంగా విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎంతో నష్టపోయింది. రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. ఏపీలో కనీసం టయర్‌–1 నగరం కూడా లేదు. 
►రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం కేవలం.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ వల్లనే సాధ్యమవుతుంది. రాష్ట్రానికి బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు.

వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలి
►దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది వ్యవసాయ రంగం. దేశ వ్యాప్తంగా దాదాపు 60 శాతం మంది ఈ రంగంపై ఆధారపడగా, రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ రంగంలో కూడా పలు అవరోధాలు ఉన్నాయి. వాటన్నింటినీ గట్టెక్కిస్తే ఈ రంగాన్ని ఎంతో ప్రోత్సహించినట్లు అవుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..
►పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి.
►నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులో తీసుకు రావాలి.
►పంటల స్టోరేజీ, గ్రేడింగ్, ప్రాసెసింగ్‌లో కొత్త టెక్నాలజీని అలవర్చుకోవాలి.
►రైతులు తమ పంటలను సరైన ధరకు ఫాం గేట్‌ వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలి. 
►రైతుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర రానప్పుడు ప్రభుత్వమే ఆదుకునే విధంగా కచ్చితంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. ఈ నిధి ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందేలా చూడాలి.
►ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయిన పక్షంలో సకాలంలో వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కచ్చితంగా సాగు చేసే భూమి విస్తీర్ణం కూడా పెరగాలి. ఈ చర్యలన్నింటి వల్ల వ్యవసాయ రంగం మరింత బలోపేతం కావడంతో పాటు రైతుల ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.

రైతు భరోసా కేంద్రాలు 
►రైతులకు సహాయకారిగా, అండగా ఉండేందుకు రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. విత్తనాలు మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులకు అడుగడుగునా చేదోడుగా ఉండేలా ఈ కేంద్రాలు పని చేస్తున్నాయి. మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.
►ఈ కేంద్రాల్లో వాటిలో డ్రై స్టోరేజీలు (గోదాములు), డ్రై ప్లాట్‌ఫామ్స్‌ (పంటను ఎండబెట్టుకునే వేదిక), కలెక్షన్‌ కేంద్రాలు (పంట సేకరణ), ప్రైమరీ ప్రాసెసింగ్‌ (ప్రాథమికంగా శుద్ధి), ఎస్సేయింగ్‌ ఎక్విప్‌మెంట్‌ (పరీక్ష పరికరాలు), బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (పెద్ద పరిమాణంలో పాలను నిల్వ చేసే కేంద్రం), ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.
►కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రాష్ట్రంలోని ప్రతి ఆర్బీకేలో సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తూ, ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం.

భౌతిక మౌలిక సదుపాయాల కల్పన
దారిద్య్ర నిర్మూలన, ఆర్థిక పురోగతిలో భౌతిక మౌలిక సదుపాయాల కల్పన ఎంతో కీలకం. అందుకే విద్యుత్, రహదారులు, నౌకాశ్రయాల వంటి వాటితో పాటు, సామాజిక మౌలిక సదుపాయాలైన విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి ముఖ్యమైన అంశాలలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు. 

సంప్రదాయేతర విద్యుత్‌ 
►విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాం. ఆ దిశలో 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇటీవల టెండర్‌ ప్రక్రియను కూడా చేపట్టాం. దీంతో రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.48కే అందుబాటులోకి వస్తుంది.
►రాష్ట్రం ఇప్పుడు యూనిట్‌ విద్యుత్‌ను సగటున రూ.5.2 కు కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు సౌర విద్యుత్‌తో ఆ వ్యయం గణనీయంగా తగ్గనుంది. ఇంకా రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా మరో 33 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 
►ఈ నేపథ్యంలో కేంద్రం కూడా చొరవ తీసుకుని రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా విద్యుత్‌ ఉత్పత్తి కోసం తీసుకున్న రుణాలపై ఇప్పుడు ఉన్న వడ్డీ రేటు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

విద్య, వైద్య – ఆరోగ్య రంగాలపై దృష్టి
►దేశ సామాజిక, ఆర్థిక పురోగతిలో విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమైనవి. అందుకే ఆ రెండింటిలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపట్టింది. 
►విద్యా రంగంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలతో పాటు, ప్రభుత్వ హాస్టళ్లను పూర్తిగా మారుస్తున్నాం. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు సాధించడంతో పాటు, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపర్చే విధంగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చాం.
►విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. మీ అందరికీ తెలుసు. మెరుగైన వైద్య సదుపాయం కూడా కొరవడింది. అందుకే వైద్య, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో పలు మార్పులు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తున్నాం. 
►గ్రామాల్లో 10 వేలకు పైగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ప్రారంభిస్తున్నాం. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో మూడింటికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. మిగిలిన 13 వైద్య కళాశాలలకు కూడా అనుమతి ఇవ్వడంతో పాటు, ఆర్థికంగా కూడా సహాయం చేయాలని కోరుతున్నాను.

ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు
►గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు ఉంటే గ్రామాల్లో తప్పనిసరిగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 
►కాబట్టి వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

పరిపాలన సంస్కరణలు – సచివాలయాల వ్యవస్థ
►ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాలనలో సంస్కరణలు ఎంతో ముఖ్యం. అందుకే ఆ దిశగా ఎన్నో చర్యలు తీసుకున్నాం. పరిపాలన వికేంద్రీకరణే కాకుండా సమర్థవంతంగా టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాం. ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. సేవలు అందిస్తున్నాం’
►రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. మొత్తం 540 రకాల సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్నాం.

ఇంటింటికీ ఇంటర్నెట్‌ 
►అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా అన్ని రకాల సేవలు మరింత మెరుగవుతాయి. భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ దిశ లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చర్యలను చేపడుతుంది.
►గ్రామ స్థాయిలో ప్రతి పౌరుడికీ, ప్రభుత్వ వ్యవస్థకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం. గ్రామాల్లో పబ్లిక్‌ డిజిటల్‌ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చి వర్క్‌ ఫ్రమ్‌ హోం అందుబాటులోకి తీసుకు వస్తాం.
►ఈ సమావేశంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు