అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు

25 Jun, 2022 02:05 IST|Sakshi

43.96 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 27న జమకు కేబినెట్‌ ఆమోదం 

82.31 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం

వైద్య కళాశాలల్లో 3,530 పోస్టుల భర్తీ

వచ్చే నెలలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు

అర్హులైనా గతంలో సంక్షేమ ఫలాలు దక్కని వారికి వచ్చే నెల 19న అమలు  

విద్యుత్‌ రాయితీకి ఆక్వా సాగు రైతుల అర్హత ఐదు నుంచి పది ఎకరాలకు పెంపు 

గండికోట ఇంటిగ్రేటెడ్‌ పర్యాటక ప్రాజెక్టుకు 1,169 ఎకరాలు కేటాయింపు

వంశధార నిర్వాసితులకు అదనంగా రూ.216.71 కోట్ల పరిహారం చెల్లింపు

మంత్రివర్గం నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన వేణు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు. ఈ పథకం కింద ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు.

ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నాణ్యమైన విద్య దిశగా మరో ముందడుగు
ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యా రంగంలో మరో భారీ కార్యక్రమం అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తద్వారా కొందరికే పరిమితమైన ఎడ్యు–టెక్‌ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు అందుబాటులోకి రానుంది. 
► ఏటా రూ.20 వేల నుంచి రూ.24 వేలు పైబడి చెల్లిస్తేకాని లభించని బైజూస్‌.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు అందుబాటులోకి వస్తోంది. తెలుగు – ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
► 2025లో సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులుగా మార్చేందుకు ప్రభుత్వం ఇంకొన్ని అడుగులు వేస్తోంది. ఈ విద్యార్థులకు సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు ఇవ్వనుంది.
► దాదాపు 4.7 లక్షల మంది పిల్లలకు ఈ సెప్టెంబర్‌లో ట్యాబ్‌లు ఇస్తున్నాం. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తుంది. వీళ్లు 9వ తరగతిలోకి వెళ్లేసరికి ఆ తరగతి పాఠాలకు సంబంధించి కంటెంట్‌ డౌన్లోడ్‌ చేసి సిద్ధం చేస్తుంది. అలాగే 10వ తరగతిలోనూ కంటెంట్‌ను సమకూరుస్తుంది. 
► వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రించనుంది. వీడియో కంటెంట్‌ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తోంది. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రులు 

వచ్చే నెలలో సంక్షేమ క్యాలెండర్‌ అమలు 
► 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జూలైలో అమలు చేయనున్న నాలుగు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 5న జగనన్న విద్యా కానుక, జూలై 13న వైఎస్సార్‌ వాహన మిత్ర, జూలై 22న వైఎస్సార్‌ కాపు నేస్తం, జూలై 26న జగనన్న తోడు పథకాల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
► వివిధ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి.. మిగిలి పోయిన లబ్ధిదారులకు జూలై 19న ఆ పథకాల కింద ప్రయోజనం చేకూర్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
► వంశధార ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారంగా రూ.216.71 కోట్ల పంపిణీకి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. 

వర్శిటీ, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ
► యూనివర్సిటీలు, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
► 70 ఏళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదనే ప్రతిపాదనకు ఆమోదం. పెన్షనర్‌ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌ మరణిస్తే అంతిమ సంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
► అర్జున అవార్జు గ్రహీత, ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ వెన్నంకు గ్రూప్‌–1 సర్వీసు కింద డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులో నియామకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లును మంత్రివర్గం ఆమోదించింది.

కొత్త వైద్య కళాశాలల్లో 3,530 పోస్టుల భర్తీ
► విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో ఒక్కో కళాశాలలో 706 ఉద్యోగాల చొప్పున, మొత్తంగా 3,530 కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌.
► వైద్య విధాన పరిషత్‌కు సంబంధించిన ఆస్పత్రుల్లో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని ఉంచేందుకు వీలుగా అదనంగా మరో 2,558 పోస్టులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం.  

ఆక్వా రైతులకు పెద్ద ఊరట 
► ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలలో రాయితీ ఇస్తోంది. ఇప్పటికే 5 ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు అందిస్తోంది. ఇప్పుడు పది ఎకరాలలోపు ఆక్వా సాగు చేస్తున్న రైతులకు కూడా దానిని వర్తింప చేయడానికి ఆమోదం.  
► రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.500 కోట్ల రుణాలకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అనుమతి.
► ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు 3,700 మెగావాట్ల హైడ్రో పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం. దీనివల్ల రైతులకు ఎకరాకు లీజు రూపేణా రూ.30 వేలు నికర ఆదాయం లభిస్తుంది. 
► ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పునర్‌ వ్యవస్థీకరణ, కొత్త పోస్టుల నియామకం, ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ బలోపేతం వంటి ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌. 

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిల్‌లలో పైవేటుకూ భాగస్వామ్యం 
► జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ఏంఐజీ లే ఔట్స్‌లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధికి సంబంధించి విధి, విధానాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న భూసేకరణ విధానాలకు అదనంగా మరో కొత్త విధానం ప్రవేశ పెట్టందుకు అంగీకారం. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే లేఔట్స్‌లో 40 శాతం ఫ్లాట్లను ప్రభుత్వం నిర్దేశించిన వారికి, 60 శాతం ఫ్లాట్లను ప్రైవేటు సంస్థ విక్రయించుకోవచ్చు. 
► మానసిక, శారీరక దివ్యాంగులకు, అనాథలకు, నిరుపేదలకు సేవలు అందిస్తున్న వివిధ ఛారిటబుల్‌ సంస్థలకు ఇచ్చిన స్థలం లీజు కాలాన్ని పొడిగించేందుకు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు అనుమతి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

గండికోటలో ఇంటిగ్రేటెడ్‌ టూరిజం ప్రాజెక్టు 
► వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటిగ్రేటెడ్‌ టూరిజం ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖకు 1,131.39 ఎకరాల స్థలం కేటాయింపునకు ఆమోదం.
► టూరిజం పాలసీ 2020–25కు అనుగుణంగా తిరుపతిలో నొవొటెల్‌ బ్రాండ్‌ కింద హోటల్‌ నిర్మాణానికి లీజు విధానంలో భూమి కేటాయించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌. 
► హరే కృష్ణా మూవ్‌మెంట్, దేవదాయ శాఖ మధ్య భూమి లీజు ఒప్పందం విషయంలో స్టాంప్‌ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం.
► 2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న 90,789 మంది రైతుల పంటలకు రూ.182,60,06,490 అదనపు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేసేందుకు కేబినెట్‌ ఆమోదం.

మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. 
► జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 13 పాత జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ చైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా తెచ్చేందుకు ఆమోదం. 
► బద్వేలులో కొత్తగా ఏర్పాటు చేసిన సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో 26 పోస్టుల నియామకాలు. 
► సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు.
► వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాలను ప్రభుత్వ ఈక్విటీగా పరిగణన.
► ఈ నెల 22న స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం.
► తిరుపతి ఏపీఐఐసీలో ఈఎంసీ–2లో వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎకరా రూ.38.44 లక్షల చొప్పున 75 ఎకరాల కేటాయింపు. 
► ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ సిబ్బంది, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల మేరకు పే స్కేల్స్‌ వర్తింపు.
► హైకోర్టు ఆదేశాల మేరకు డిసిఫ్లీనరీ ప్రొసీడింగ్స్‌ ట్రిబ్యునల్‌ రద్దు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్న డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్, సభ్యులను నియమించని పరిస్థితి. మూడు నెలల్లో కేసులు పరిష్కారించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు.. వాటిని పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం. ఇందులో భాగంగా ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న 789 కేసులను కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌కి బదలాయించాలని ఆదేశం.
► గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో 100 కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌. ఈ మేరకు సర్వీసు రూల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశం. 

ఇక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా..
► కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌ను ఆమోదించింది. 
► కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టులు మంజూరు.
► నెల్లూరు జిల్లా కనుపూరులో మైసూరుకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్ట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ క్లాసికల్‌ తెలుగు కోసం 5 ఎకరాల స్థలం.
► సత్యసాయి జిల్లా పెనుకొండలో 63.29 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.
► ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్ట్‌ 1971కు సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌. 
► వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరులోని సర్వారాయ సాగర్‌ రిజర్వాయర్‌ పేరును కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్‌గా మార్పు చేస్తూ.. జల వనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. 

మరిన్ని వార్తలు