YSR Kapu Nestham : అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను

23 Jul, 2021 02:07 IST|Sakshi
వైఎస్సార్‌ కాపు నేస్తం చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, లబ్ధిదారులు

వరుసగా రెండో ఏడాది కాపునేస్తం 

కాపు మహిళల ఖాతాల్లోకి నేరుగా రూ.490.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌

మహిళలను వారి కాళ్లమీద వారిని నిలబెట్టాలనే గొప్ప ఆలోచన నుంచి ఉద్భవించిన పథకం ఇది

మేనిఫెస్టోలో చెప్పకపోయినా అమలు చేస్తున్నాం

ఏ నెలలో ఇచ్చేది ముందుగానే చెప్పి భరోసా కల్పిస్తున్నాం

తద్వారా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం

అర్హులందరికీ పథకం అందాలని తపన పడుతున్నాం

ఇంకా ఎవరికైనా రాకుంటే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు

కాపుల సంక్షేమానికి రెండేళ్లలో రూ.12,125 కోట్ల వ్యయం

డీబీటీ, నాన్‌ డీబీటీల ద్వారా పెద్ద ఎత్తున మేలు చేకూర్చాం

ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పథకాల అమలు 

వైఎస్సార్‌ కాపు నేస్తంతో 3.27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం.. 

గత సర్కారు కాపులకు ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు

బరువు మోస్తున్న త్యాగమూర్తులు.. 
అత్యంత బాధ్యతాయుతంగా ఉండే 45–60 ఏళ్ల వయసు అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే అది నేరుగా కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఈ వయసులో ఉన్నవారంతా త్యాగమూర్తులు, కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్నవారు. వారికి మేలు చేయాలనే సంకల్పంతో.. వారి చేతికే నేరుగా డబ్బులు అందించే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా రెండో సంవత్సరం కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నాం. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మా అన్నయ్య ఉన్నారనే ధైర్యం..
చాలామంది రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్పారు. మీరు కాపులను గుర్తించి ఒక స్ధాయిని ఇచ్చారు. గత ఏడాది లాక్‌డౌన్‌తో వ్యాపారంలో పూర్తిగా నష్టపోయా. నాకు కాపు నేస్తం వర్తిస్తుందని వలంటీర్‌ చెప్పడంతో ఆ పథకం ద్వారా లబ్ధి పొందా. ఒంటరి మహిళ పెన్షన్‌ కూడా అందుతోంది. ఇప్పుడు వ్యాపారం కూడా పుంజుకుంది. అన్నలా మీరు మాకు అండగా ఉన్నారు. పిల్లలను బాగా చదివిస్తున్నా. ఇంటి అద్దె కట్టలేక ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు నాకు ఇంటి స్థలం కూడా వచ్చింది. నాకు పుట్టింటివారు, అత్తింటివారు లేకపోయినా మా అన్నయ్య ఉన్నారన్న ధైర్యంతో ముందుకెళుతున్నాం. మేం ఏ కష్టం లేకుండా బతుకుతున్నాం అంటే మీరే కారణం. నేను పొదుపు సంఘంలో సభ్యురాలిని. చాలావరకు లబ్ధి పొందాం. నాకు కోవిడ్‌ వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ బాగా చూసుకున్నారు. నాలా ఎంతోమంది అక్కచెల్లెమ్మలు మీరు ఉన్నారని ధైర్యంగా బతుకుతున్నారు.
– రుక్మిణీదేవి, లబ్ధిదారురాలు, సత్రంపాడు, ఏలూరు

సాక్షి, అమరావతి: నిరుపేద కాపు అక్క చెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబనే లక్ష్యంగా వైఎస్సార్‌ చేయూత తరహాలో ‘వైఎస్సార్‌ కాపునేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం గురువారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

వరుసగా రెండో ఏడాది..
వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున ఐదేళ్లు క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా రూ.75 వేలు వారి చేతిలో ఉంటాయి. మహిళలకు ఆర్థిక తోడ్పాటు కల్పించి వారి కాళ్ల మీద వారిని నిలబెట్టాలనే గొప్ప ఆలోచనతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. ఇందులో మొట్టమొదటిగా వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. ఏటా రూ.18,750 చొప్పున 45 నుంచి 60 ఏళ్ల వయసు అక్కచెల్లెమ్మలకు వరుసగా నాలుగేళ్ల పాటు ఇస్తున్నాం. 60 ఏళ్లు దాటితే పెన్షన్‌ వర్తిస్తుంది. కాబట్టి వారికి ఆ రూపంలో మేలు జరుగుతుంది. 

ముందుగానే చెప్పి ఇస్తున్నాం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తోడుగా నిలుస్తూ చేయూత పథకం ద్వారా మల్టీ నేషనల్‌ కంపెనీలతో అనుసంధానించేలా చర్యలు చేపట్టాం. వ్యాపార అవకాశాలను మరింత మెరుగుపరచి వారికి మేలు చేయాలన్న తపనతో రిలయన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ లీవర్, అమూల్‌ లాంటి కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఈ పెద్ద కంపెనీలు తమ వంతు ప్రయత్నం చేయగా మిగిలిన వాళ్లందరికీ కూడా కాపు నేస్తం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూ వెళితే వ్యాపార దృక్పథంతో అడుగులు వేసే పరిస్ధితి వస్తుంది. తద్వారా వారు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుని వ్యాపారాలు నిర్వహించాలన్న ఆలోచన కలుగుతుంది. ఏ నెలలో డబ్బులు ఇస్తున్నామో ముందుగానే చెప్పి భరోసా కల్పిస్తున్నాం. ప్రభుత్వం మాట చెబితే కచ్చితంగా ఇస్తుందనే నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోగలుగుతారు.
వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్‌ కాపు నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం 

మేనిఫెస్టోలో చెప్పకపోయినా....
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 – 60 ఏళ్ల వయసున్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు నేరుగా వాళ్ల చేతుల్లోనే పెడతాం. ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా ఇది చేస్తే బాగుంటుందని అమలు చేస్తున్నాం. నిండు మనసుతో కాపు అక్క,చెల్లెమ్మలకు మంచి జరగాలని చేపట్టిన కార్యక్రమమిది.

ఒక్క కాపు నేస్తం ద్వారానే రూ.982 కోట్లు
కాపు నేస్తం అనే ఒక్క కార్యక్రమం ద్వారా గత ఏడాది 3,27,349 మందికి రూ.491.02 కోట్ల మేర లబ్ధి చేకూరింది. రెండేళ్లలో మొత్తంగా దాదాపుగా రూ.982 కోట్లు వారి చేతుల్లో పెట్టడం జరిగింది. అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నాం. మంచి చేసే విషయంలో ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. త్వరితగతిన అడుగులు వేస్తూనే మంచి చేస్తున్నాం. మీ బిడ్డకు మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

మళ్లీ దరఖాస్తుకు అవకాశం..
మరో ముఖ్యమైన విషయం.. అర్హులందరికీ మేలు చేకూర్చాలనే తపన పడుతున్నాం. ఈ పథకం ఎక్కడైనా, ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందొద్దు. గ్రామ సచివాలయానికి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్‌ చేసి నెల రోజుల్లో అర్హులకి పథకాన్ని వర్తింపజేస్తాం. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.
మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆడపా శేషగిరి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజా, జంగాలపల్లి శ్రీనివాసులు, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి. అనంతరాములు, కాపు వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ శ్రీనివాస శ్రీనరేష్‌ పాల్గొన్నారు.

గత ప్రభుత్వ పాలనలో.. 
ఈ సందర్భంగా మీకు మరో విషయాన్ని చెప్పాలి. గత ప్రభుత్వ పాలనలో కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున ఇస్తామని చెప్పి కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్ధితిని ఒక్కసారి గుర్తు చేసుకోమని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు విజ్ఞప్తి చేస్తున్నా. 

ఇప్పుడు 15 రెట్లు అధికంగా..
ఈ రెండు సంవత్సరాల కాలంలో మీ అందరి చల్లని దీవెనలతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం, మీ అన్న, తమ్ముడి ప్రభుత్వం దాదాపు రూ.12,125 కోట్లను నేరుగా కాపు అక్కచెల్లెమ్మలు, కాపు సోదరుల చేతుల్లో పెట్టగలిగింది. రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా 59,63,408 మందికి గత ప్రభుత్వం కన్నా 15 రెట్లు అధికంగా సహాయం చేశాం. ఈ డబ్బులను పాత అప్పులు, బకాయిలకు జమ చేసుకోవద్దని బ్యాంకులతో ఇప్పటికే మాట్లాడాం.

కాపులకు రెండేళ్లలో రూ.12,125 కోట్లు..
వివిధ పథకాల కింద ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ, నగదేతర బదిలీల ద్వారా 59,63,408 మందికి మేలు జరిగేలా రూ.12,124.57 కోట్లను కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక్క రూపాయి కూడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్‌ నొక్కి పారదర్శకంగా అందచేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరగాలనే లక్ష్యంతో పనిచేశాం. 47,88,763 మందికి నేరుగా దాదాపు రూ.9,359 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశాం. రెండేళ్లలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసిన సాయం వివరాలు ఇవీ..

నగదేతర బదిలీ (నాన్‌ డీబీటీ)...
► నాన్‌ డీబీటీ స్కీంలు తీసుకుంటే వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా 2,56,424 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,160 కోట్ల విలువైన ఇళ్లపట్టాలు ఇవ్వగలిగాం. 
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 1,16,797 మందిని రూ.289 కోట్లతో ఆదుకున్నాం.
► వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 1,50,800 మంది అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు మంచి జరిగేలా రూ.144 కోట్లు ఖర్చు చేశాం. 
► జగనన్న గోరుముద్ద ద్వారా 2,84,024 మంది పిల్లలకు రూ.123 కోట్ల ఖర్చుతో మంచి చేశాం. 
► జగనన్న విద్యా కానుక ద్వారా 3,66,600 మందికి రూ.50 కోట్లు ఖర్చు చేశాం. 
► మొత్తంగా నాన్‌ డీబీడీ విధానంలో 11,74,645 మందికి రూ.2766 కోట్లు ఖర్చు చేశాం. 
► డీబీటీ, నాన్‌ డీబీటీ రెండూ కలిపి రెండేళ్లలో 59,63,408 మందికి మేలు చేస్తూ దాదాపు రూ.12,125 కోట్లు వెచ్చించాం. 

అన్నయ్య రాఖీ కానుక
మాకు జిరాక్స్‌ షాప్‌ ఉంది. మేం కాపులమని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మీరే కారణం. మాట ఇచ్చి అమలు చేస్తున్నారు. కాపు నేస్తం ద్వారా వచ్చిన డబ్బులతో శారీ డిజైనింగ్‌ పెట్టుకున్నా. డ్వాక్రాలో కూడా లబ్ధి పొందా. నా కాళ్లమీద నిలబడి బతకగలననే ధైర్యం వచ్చింది. ఇళ్ల పట్టా కూడా వచ్చింది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానిస్తా. తప్పకుండా రావాలన్నా. మా తమ్ముడికి వాహనమిత్ర వచ్చింది. వారి పిల్లలకు అమ్మ ఒడి అందింది. నాకు ఇప్పుడు ఇస్తున్న డబ్బులను మా అన్నయ్య రాఖీ కానుకగా ముందుగానే ఇస్తున్నారని భావిస్తున్నా. మమ్మల్ని ఇంతగా గుర్తించిన మీకు కాపు మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.    
    – తలాటం కాళీప్రియ, లబ్ధిదారు, కాకినాడ

మీ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లోనూ..
మాకోసం నవరత్నాలను తెచ్చి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మీరు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి పొరుగు రాష్ట్రాల వారు కూడా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మీరు మిగతా నాయకుల్లా కాదు. మాట ఇచ్చారంటే కచ్చితంగా అమలు చేస్తారు. కరోనా కష్టకాలంలోనూ ప్రతీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాపులకు ఒక స్నేహితుడిలా దగ్గరై మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. నాకు రైతు భరోసా అందింది. జలకళ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుంది. మీరు సీఎంగా వచ్చిన వేళా విశేషం వర్షాలు బాగా పడుతున్నాయి. రాయలసీమలో అన్ని చెరువులు, బావులు నిండాయి.
– అమరావతి, లబ్ధిదారు, పెద్దిశెట్టిపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా

మనసుతోనే ముఖ్యమంత్రి పాలన..
‘సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 59 లక్షల మంది కాపు సోదర, సోదరీమణులకు రూ.12 వేల కోట్ల లబ్ధి కలిగించారు. పేరుకే అగ్రవర్ణాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్న కాపు కులస్తులను జగన్‌.. ఎన్నికల ముందు ఓట్ల కోసం మాటల ఎర వేయకుండా ప్రేమతో తను చేయగలిగే ప్రతి పనిని తెలియజేశారు. గత ప్రభుత్వం లాగా మోసం చేయకుండా.. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునేందుకు ఐదేళ్లలో ప్రతి కాపు సోదరీమణికి రూ.75 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. కాపు నేస్తం డబ్బుతో వారు స్వయంశక్తితో ఎదిగేలా సిద్ధమయ్యారు. మీ పాలన మనసుతో చేస్తున్నారని రుజువైంది’ అని మంత్రులు పేర్ని నాని,  చెల్లుబోయిన  అన్నారు. 

మరిన్ని వార్తలు