YS Jagan: ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం..

11 May, 2021 03:21 IST|Sakshi

వ్యాక్సినేషన్‌పై సమీక్షలో అధికార యంత్రాంగానికి సీఎం జగన్‌ నిర్దేశం

టీకాలపై ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు స్పష్టంగా చెప్పాలి

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది

రాష్ట్రం నేరుగా కొనాలన్నా కంపెనీలు ఎన్ని అమ్మాలో, ఏ రాష్ట్రానికి ఎన్ని విక్రయించాలో కూడా కేంద్రమే నిర్ణయిస్తోంది

ఇవన్నీ తెలిసినా కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా దుష్ప్రచారం 

కావాలనే ప్రజల్లో ఆందోళన, భయాన్ని సృష్టిస్తున్నారు

నెలకు కోటి టీకాలు సరఫరా చేయగలిగితే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు కనీసం 6 నెలలు 

ప్రస్తుతం వస్తోంది సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులే 

45 ఏళ్లకు పైబడి మొదటి డోస్‌ తీసుకున్న వారికి గడువు ప్రకారం వెంటనే రెండో డోస్‌ ఇవ్వాలి

వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాటలు కనిపించకూడదు

టీకాలు ఎవరికి ఇస్తారనేది వలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ముందుగానే చెప్పాలి

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉచితంగా  వ్యాక్సిన్‌ ఇస్తుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని చెప్పండి

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలన్నా ఎన్ని విక్రయించాలనేది కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోందన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్నీ కేంద్రమే నిర్ణయిస్తోందని, ఆ కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అది కూడా డబ్బులు ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. \

వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా కలసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. దురుద్దేశ పూర్వకంగా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని, కావాలనే ప్రజల్లో ఆందోళన, భయాన్ని సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్‌ బృందంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ...
వ్యాక్సినేషన్‌పై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు 

అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌
వ్యాక్సినేషన్‌పై అన్ని విషయాలు తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశంతో ఆ ప్రచారాలు చేస్తున్నారు. కావాలనే ప్రజల్లో ఆందోళనను, భయాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి వాస్తవ పరిస్థితులన్నింటినీ ప్రజలకు వివరించాలి. అందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుందని, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి.

రద్దీ నివారించాలి..
వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదు. వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారన్న దానిపై వలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ముందుగానే ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. దీనివల్ల వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద క్యూలు ఉండే పరిస్థితిని నివారించవచ్చు. వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి టీకా తీసుకునే వారికి సౌకర్యంగా ఉండేలా చూడాలి.

వారికి వెంటనే రెండో డోస్‌...
45 ఏళ్లకు పైబడి, మొదటి డోస్‌ తీసుకుని రెండో డోస్‌కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందించేలా చూడాలి. అలా చేయకపోతే ( రెండో డోస్‌ అందకపోతే) తొలి డోస్‌ తీసుకున్న వారికి పూర్తి స్థాయిలో ప్రయోజనం ఉండదు. కాబట్టి 45 ఏళ్లు పూర్తి అయిన  వారిలో తొలి డోస్‌ వేసుకున్న వారందరికీ తప్పనిసరిగా గడువు ప్రకారం రెండో డోస్‌ ఇవ్వాలి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ఇప్పుడు వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. వారందరికీ వ్యాక్సిన్‌ పూర్తి అయిన తర్వాత 18 ఏళ్లకు పైబడిన వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలి.

కేంద్రంతో చర్చించండి..
నెలకు కోటి వ్యాక్సిన్లు సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతుంది. ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయి. వ్యాక్సిన్ల కొనుగోళ్లపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లేందుకు అనుమతి కోసం అధికారులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి. 

కేంద్రం ఇప్పటివరకు ఇచ్చినవి 73,49,960
► ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన వ్యాక్సిన్లు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న టీకాల వివరాలను సమావేశంలో అధికారులు వివరించారు. ఆ గణాంకాలు ఇవీ..

► రాష్ట్రానికి కోవిషీల్డ్‌ మొత్తం 60,60,400 డోసులు రాగా తొలిడోస్‌ కింద 43,99,802, రెండో డోస్‌ కింద 16,87,315 ఇచ్చాం. టీకాలు వృథా కాకుండా నైపుణ్యంతో వినియోగించడం ద్వారా మొత్తం 60,87,117 డోస్‌లు ఇచ్చాం.

► కోవాక్సిన్‌ మొత్తం 12,89,560 డోసులు రాగా తొలి డోస్‌ కింద 9,23,296 వాక్సీన్లు, రెండో డోస్‌ కింద 2,90,047 వ్యాక్సీన్లు కలిపి మొత్తం 12,13,343 కోవాక్సిన్‌ డోస్‌లు ఇచ్చాం.

► కోవిషీల్డ్, కోవాక్సిన్‌ రెండూ కలిపి మొత్తం 73,49,960 డోసులు రాగా తొలి డోస్‌ కింద 53,23,098 వ్యాక్సిన్లు, రెండో డోస్‌ కింద 19,77,362 వ్యాక్సిన్లు  కలిపి ఇప్పటి వరకు మొత్తం 73,00,460 ఇచ్చాం. 

► 45 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 1,33,07,889 మంది నమోదు చేసుకోగా తొలి డోస్‌ 41,08,917 మందికి, రెండో డోస్‌ 13,35,744 మందికి అందచేశాం. 

► ప్రస్తుతం మే నెలలో తొలి 15 రోజులకు సంబంధించి కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌ రెండూ కలిపి 9,17,850 డోస్‌లు ఇస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు 7,65,360 డోస్‌లు ఇచ్చింది. ఇంకా 1,52,490 డోస్‌లు రావాల్సి ఉంది.

► ఇక రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కింద కేంద్రం నిర్ణయించిన ప్రకారం 16,85,630 డోసులు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 4,93,930 మాత్రమే ఇచ్చారు. ఇంకా 11,91,700 రావాల్సి ఉంది.
భారత్‌ బయోటెక్‌ నుంచి 3,43,930 డోస్‌లు కేటాయించామని.. డబ్బులు చెల్లించి వాటిని కొనుక్కోవాలని ఏప్రిల్‌ 29న కేంద్రం పంపిన లేఖ 

 – ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు