మనసుకి కష్టంగా ఉంది.. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ భావోద్వేగం

28 Mar, 2022 13:18 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: గౌతమ్‌ మన మధ్య లేడనే విషయం నమ్మడానికి మనసుకి కష్టంగా ఉందని, ఎంత చెప్పినా ఆయన లేని లోటు తీరనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో సోమవారం జరిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం జగన్‌.. గౌతమ్‌ చిత్రపటానికి నివాళి అర్పించి అనంతరం ప్రసంగించారు. 
 
గౌతమ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అని, ప్రతీ అడుగులో గౌతం తనకు తోడుగా ఉండేవాడని సీఎం జగన్‌ అన్నారు.  రాజమోహన్‌ గారికంటే గౌతమ్‌ ఆత్మీయత తనకు ఎక్కువగా అనిపించేదని, తన ప్రోత్సాహంతోనే గౌతమ్‌ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. 

రాజకీయాల్లో తనకు తోడుగా, స్నేహితుడిగా ఉండేవారన్నారు. వయసులో పెద్దవాడైనా.. ఆ గర్వం కనిపించేది కాదని, పైగా సోదర భావంతో మెలిగేవాడని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఎంతో తాపత్రయపడ్డాడని, చివరి క్షణం వరకూ రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని చెప్పారు. ఆ కుటుంబానికి తానే కాదు.. వైఎస్సార్‌సీపీ మొత్తం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం జగన్‌.

మరిన్ని వార్తలు