సాక్షి, అనకాపల్లి జిల్లా: మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. గురువారం యలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి.. వారికి అవసరమైన సాయం చేశారు.
కొండమంచిలి వాణి
యలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి వాణి అమ్మమ్మ విన్నవించుకున్నారు. దీంతో తక్షణ సహాయానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు.
కలగా శివాజి
ఎస్. రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు. ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పని చేయకపోవడంతో వీల్ఛైర్కే పరిమితమయ్యాడు. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్ధోమత లేదని సీఎంకి శివాజి కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు.
చదవండి: Andhra Pradesh: మళ్లీ ఉద్యోగాల జోష్
ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.