ఏలూరు బాధితులకు వైద్య పరీక్షలపై సీఎం ఆరా

8 Dec, 2020 13:51 IST|Sakshi

రేపు అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న పరీక్షలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటివరకూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎంకు వివరించారు. అస్వస్థతకు గురైన వారికి ఎయిమ్స్‌ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్‌ లాంటి మూలకాలు ఉన్నట్టుగా తెలుస్తోందని మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని ఆ వివరాలు కూడా త్వరగా వస్తాయని వెల్లడించారు. (చదవండి: ఏలూరు: డబ్ల్యూహెచ్‌ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు)

బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆ ప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు.. వీటన్నింటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరచి తనకు ఇవ్వాలని, దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల ప్రకారం సీసం లాంటి మూలకాలు ఎలా ఆ ప్రాంత ప్రజల శరీరాల్లోకి చేరాయో, దానికి తగ్గ కారణాలను పూర్తిస్థాయిలో పరిశోధించాలని అధికారులను  సీఎం ఆదేశించారు. ప్రజారోగ్య సిబ్బంది, తదితర విభాగాలు నిశిత పరిశీలన చేయాలని, అస్వస్థతకు దారి తీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని ఆదేశించారు. బాధితులకు కొనసాగుతున్న వైద్య చికిత్స, వారికి అందుతున్న సదుపాయాలపై కూడా అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు.(చదవండి: మనం కట్టేవి 'ఊళ్లు')

>
మరిన్ని వార్తలు