మీ పని తీరు బాగుంది: సీఎం జగన్‌ ప్రశంస

30 Sep, 2020 09:27 IST|Sakshi
సీఎం నిర్వహించిన వీడియో సమావేశానికి హాజరైన కలెక్టర్‌ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తదితరులు

సాక్షి, ఒంగోలు అర్బన్‌: ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. అధికారుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. పత్తి సాగును ఎర్ర రేగడికి కాకుండా నల్లరేగడి నేలకే పరిమితం చేసేలా ప్రకాశం జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమని, బోర్ల కింద కూడా వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసేల రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశం ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటులో ప్రకాశం యంత్రాంగం పనితీరు బాగుందన్నారు.

వీటితో పాటు బియ్యం కార్డులు, పెన్షన్‌కార్డులు, ఇళ్ల పట్టాల కోసం స్థలాల గుర్తింపు విషయంలో చక్కటి పనితీరు కనపరుస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడు క్రింద పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణాలు, వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లు నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మన బడి నేడు–నేడు కింద పెండింగ్‌ బిల్లులు అక్టోబర్‌ మొదటి వారంలో చెల్లిస్తామన్నారు. పాఠశాలల పునః ప్రారంభాన్ని కోవిడ్‌ దృష్ట్యా అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 2వ తేదీకి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని వెల్లడించారు.  (కరోనా తగ్గుముఖం)

సమావేశంలో జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్, ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్, సంయుక్త కలెక్టర్‌ టీఎస్‌ చేతన్, డీఆర్‌ఓ వినాయకం, జడ్‌పీ సీఈఓ కైలాష్‌ గిరీశ్వర్, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కొండయ్య, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, పట్టు పరిశ్రమ ఏడీ రాజ్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాద్‌ ఠాగూర్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, డ్వామా పీడీ శ్రీనారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎలీషా, డీపీఓ నారాయణరెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు