YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జోష్‌

5 Jun, 2021 03:03 IST|Sakshi
పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ–అమూల్‌ పాల సేకరణ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు అప్పలరాజు, ఆళ్ల నాని, కన్నబాబు, బొత్స, ఉన్నతాధికారులు

వ్యవసాయాధారిత రంగాల్లోనూ అవకాశాల కల్పన.. 

పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ–అమూల్‌ పాల సేకరణ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

అమూల్‌ ద్వారా పాల సేకరణతో మారనున్న గ్రామీణ ముఖచిత్రం

రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పాల సేకరణ విస్తరణ

తద్వారా పాడి రైతులైన అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలోపేతం

పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులు ఇంకా గుర్తున్నాయి

లీటర్‌ పాల కన్నా లీటర్‌ మినరల్‌ వాటర్‌ ధర ఎక్కువని అక్క చెల్లెమ్మలు చెప్పారు

వీరికి లబ్ధి కలిగించేందుకే లాభాపేక్ష లేని అమూల్‌ను తెచ్చాం

తద్వారా ఏడాదికి ఒకసారి లాభాలు తిరిగి అక్కచెల్లెమ్మల చేతికే.. 

ప్రైవేట్‌ వ్యక్తుల అక్రమాలతో దెబ్బతిన్న సహకార డెయిరీలు 

సాక్షి, అమరావతి: ‘వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతులకు, అక్కచెల్లెమ్మలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరుగెత్తగలుగుతుందని నమ్మాను. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోకి అమూల్‌ని తీసుకు వచ్చాం. పాల సేకరణ ద్వారా అక్కచెల్లెమ్మలందరికీ మరింత ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. తద్వారా వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. జగనన్న పాల వెల్లువలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ–అమూల్‌ పాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆమూల్‌ పాల సేకరణను విస్తరించనున్నామని చెప్పారు. తద్వారా పాడి రైతులైన అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలోపేతం కానున్నారని పేర్కొన్నారు. ‘పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులు ఇప్పటికీ గుర్తున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఒక లీటరు పాలు తీసుకుని వచ్చి నాకు చూపించేవారు. ఒక లీటరు పాల రేటు రూ.23 ఉంది. ఒక లీటరు మినరల్‌ వాటర్‌ రేటు ఇంత కన్నా ఎక్కువుంది.. ఇదీ మా పరిస్థితి అని అక్కచెల్లెమ్మలు, పాడి రైతులు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలని, వ్యవసాయ ఆధారిత రంగాల ద్వారా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలని వెంటనే రాష్ట్రంలోకి అమూల్‌ని తీసుకొచ్చాం’ అన్నారు. అమూల్‌కు లాభాపేక్ష లేదని, లాభాలన్నీ ఏడాదికి ఒకసారి తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తూ గొప్ప పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

అమూల్‌ దేశంలో నంబర్‌ వన్‌ సహకార సంస్థ
► అమూల్‌ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అనసరంలేదు. దేశంలోనే నంబర్‌ వన్‌ సహకార రంగ సంస్థ. దాదాపుగా రూ.50 వేల కోట్లు టర్నోవర్‌ చేస్తున్న ఈ సంస్థలో వాటాదారులు ప్రైవేటు వ్యక్తులు కాదు. వాటాదారులు అందరూ కూడా పాలుపోసే అక్కచెల్లమ్మలే. మిగిలిన వాళ్లతో పోలిస్తే పాల సేకరణ ధరను అక్కచెల్లెమ్మలకు అమూల్‌ అధికంగా ఇస్తోంది. 
► అమూల్‌ సంస్థ ప్రపంచంతో పోటీ పడుతుంది. ఈ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది.  
అమూల్‌కు మిగతా సంస్థలకు తేడాను కూడా గమనించాలి. అమూల్‌ సంస్థలో పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారే చేసే విధంగా వారి ప్రాసెసింగ్‌ ఉంది.  
► సహకార సంస్థను బాగా నడిపితే, ప్రైవేటు వ్యక్తులు ఆ సంస్థను ఆక్రమించకపోతే, రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి అమూల్‌ సజీవ ఉదాహరణ. ఇలాంటి అమూల్‌ సంస్థతో 2020 జూలై 21న ఒప్పందం కుదుర్చుకున్నాం. అదే సంవత్సరం డిసెంబర్‌ 2న అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభించాం. 

ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పాల సేకరణ
► చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాల్లో విజయవంతంగా పాలసేకరణ జరుగుతోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్‌ అడుగు పెడుతోంది. 153 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభిస్తున్నాం.
► రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 2,600 గ్రామాల్లో, రెండేళ్లు పూర్తయ్యేలోగా మొత్తంగా 9,899 గ్రామాల్లో అమూల్‌ను విస్తరించి, అక్క చెల్లెమ్మలకు ప్రతి లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 వరకు ఎక్కువ రేటు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాం. 
► మిగతా డెయిరీలతో పోల్చితే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.   

‘ప్రైవేట్‌’ స్వార్థంతో సహకార డెయిరీలు మూత
► సహకార రంగంలోని డెయిరీలు నష్టాలలో కూరుకుపోయాయి. ప్రైవేటు డెయిరీలు అటు పాడి రైతులను, ఇటు వినియోగదారులను దోపిడీ చేయగలిగే పరిస్థితి నెలకొంది. ఇలా ఎందుకు జరిగిందంటే సహకార రంగంలో ఉన్న డెయిరీలకు అమూల్‌ మాదిరిగా పూర్తి స్థాయి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండాల్సిన పరిస్ధితిలో లేకపోవడమే. 
► మార్కెట్‌ను పెంచుకోవడంలో సహకార డెయిరీలు ఆ స్థాయికి ఎదగలేదు. కొన్ని మంచి డెయిరీలను ప్రైవేట్‌ వ్యక్తులు పూర్తిగా ఆక్రమించేసుకుని, వాటిని ప్రైవేట్‌ ఆస్తుల కింద మార్చుకున్నారు. 
► ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో ప్రయోజనాలు ఉన్నందు వల్ల వాళ్ల ఆదాయాలు పెంచుకునేందుకు, రాష్ట్రంలో సహకార వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిన పరిస్ధితులు మన కళ్లెదుటే కనిపించాయి. ఈ పరిస్థితిని మార్చి.. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్న అన్న తపన, తాపత్రయం, ఆరాటంతో ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది.  

కళ్లెదుటే పాలల్లో నాణ్యత పరీక్ష
► 2,600 గ్రామాల్లో మనం బీఎంసీలు అంటే బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్, ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్స్‌(ఏఎంసీ) తీసుకొస్తున్నాం. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. గతంలో పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటన్నది అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ తెలిసేది కాదు.
► ఇప్పుడు బీఎంసీలు, ఏఎంసీల వల్ల మన కళ్ల ఎదుటే మనం పోసే పాల నాణ్యత తెలిసిపోతుంది. అలా తెలిసిన వెంటనే ఒక స్లిప్‌ కూడా ఇస్తారు. దీనివల్ల అక్కచెల్లెమ్మలు ఏ ఒక్కరూ కూడా దోపిడీకి గురికారు. ఆ నాణ్యతకు తగ్గట్టుగా అక్కచెల్లెమ్మలకు అమూల్‌ మంచి రేటు ఇవ్వగలుగుతుంది. 
► ఇంతకు ముందు కూడా అక్కచెల్లెమ్మలు అదే నాణ్యత పాలు పోసినా, మోసపోయేవాళ్లు. మంచి రేటు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు అమూల్‌ మోసం చేయడం లేదు కాబట్టి, నాణ్యత అక్కడికక్కడే బయటపడుతోంది. ప్రతి లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు ప్రతి అక్కచెల్లెమ్మకు అదనంగా లబ్ధి కలుగుతోంది.  

అక్కచెల్లెమ్మల మేలు కోసం రూ.4 వేల కోట్ల పెట్టుబడి
► అక్కచెల్లెమ్మలకు ఈ మేలు ప్రతి గ్రామంలో జరగాలన్న తపన, తాపత్రయంతో దాదాపుగా 9,899 గ్రామాలను గుర్తించాం. ఈ గ్రామాల్లో రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. బీఎంసీ, ఏఎంసీల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి.
► అక్కచెల్లెమ్మల మహిళా సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలు మీకందరికీ తెలిసినవే. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, వడ్డీలేని రుణాలు, సంపూర్ణ పోషణ.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవి కాకుండా దిశ బిల్లు కానివ్వండి, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌లతో పాటు మద్య నియంత్రణ దిశగా మనమంతా అడుగులు వేస్తున్నాం. 

పనులు, పోస్టుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే
► వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగ నియామకాల్లో 50 శాతం పై చిలుకు అక్కచెల్లెమ్మలను తీసుకొచ్చాం. నామినేటెడ్‌ పోస్టులతో పాటు నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి 50 శాతం వారికే కేటాయించాం. 
► కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, బీసీ కార్పొరేషన్లు.. ఇలా ఎక్కడ చూసినా కచ్చితంగా సగం అక్కచెల్లెమ్మలకు వచ్చే విధంగా చట్టాలు తీసుకొచ్చినందువల్ల ఈ రోజు మహిళా సాధికారత అనేది ఏ స్థాయిలో ఉందనేది కనిపిస్తోంది. మనందరి ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఉపాధికి ‘చేయూత’
► చేయూత పథకం కింద అక్కచెల్లెమ్మలకు ఇచ్చే డబ్బులు మరింత మెరుగ్గా ఉపయోగపడే విధంగా ఉపాధి అవకాశాలను వాళ్ల ఇంటి ముందుకే తీసుకొస్తున్నాం. వారు పెట్టిన పెట్టుబడి నష్టపోకూడదనే ఉద్దేశంతో పెద్ద, పెద్ద సంస్థలతో టై అప్‌ చేశాం. 
► ఐటీసీ, అమూల్, రిలయన్స్, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్, హిందుస్థాన్‌ లీవర్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలతో టై అప్‌ చేసి ఆ అక్కచెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నాం. లక్షా 12 వేల యూనిట్ల ఆవులు, గేదెలు కొనుగోలు చేయించి, రూ.75 వేల మొత్తాన్ని ‘చేయూత’కు టై అప్‌ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ అందరికీ మరింతగా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.  
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అమూల్‌ ఎండీ ఆర్‌ ఎస్‌ సోధి, సబర్‌ డెయిరీ ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌ హాజరయ్యారు.  

అమూల్‌ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో 13,739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52,93,000 లీటర్ల పాలు సేకరించింది. అందుకు రూ.24 కోట్ల 54 లక్షల చెల్లింపు జరిగింది. తద్వారా ఇంతకు ముందు ఆ అక్కచెల్లెమ్మలు అమ్ముతున్న ధర కంటే ప్రతి లీటరు మీద రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అమూల్‌ సంస్థ చెల్లించింది. ఈ లెక్కన రూ.4 కోట్ల 6 లక్షలు ఆ అక్కచెల్లెమ్మలకు అదనంగా ఆదాయం వచ్చిందని ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు 
గతంలో పాల కేంద్రం నిర్వహణ మహిళల వల్ల కాదు అన్నారు. మీ వల్ల నేడు మా గ్రామంలో మేమే దానిని నిర్వహించగలుగుతున్నాం. మీరు ఉన్నారనే ధైర్యం ఇప్పుడు మాకు వచ్చింది. అమూల్‌ పాల వెల్లువను ఇంకా ముందుకు తీసుకుపోతాం. అమూల్‌కు పాలు పోయడం వల్ల మా సభ్యుల్లో ఒకరికి లీటర్‌కు 75 రూపాయలు వచ్చాయి. గతంలో ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు.    
 – సుజాత, కొమ్ముగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా     

మరిన్ని వార్తలు