సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. కృష్ణా నది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారంగా రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.00 గంటల మధ్య రాణీగారితోట వద్ద వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇలా..
► విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు 1.5 కి.మీ పొడవునా ఫ్లడ్ ప్రొటెక్షన్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు.
► నదికి భారీ వరదలు వచ్చినప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్కు రూపకల్పన చేశారు.
► ఇందులో భాగంగా మూడు అడుగుల వ్యాసంలో 18 మీటర్ల లోతుకు పైల్, రాఫ్ట్ పునాదులపై 8.9 మీటర్ల ఎత్తులో 1.5 కి.మీ పొడవునా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు.
వైఎస్సార్ సంకల్పమే..
కాగా, 2009లో కృష్ణా నదికి వరదలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విజయవాడ వచ్చి ఫ్లడ్ రిటైనింగ్ వాల్ మంజూరు చేశారు. అప్పట్లో యనమలకుదురు నుంచి కోటినగర్ వరకు ఈ వాల్ నిర్మించారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం కరకట్ట (వారధి) నుంచి కోటినగర్ వరకు ఫ్ల్లడ్ రిటైనింగ్ వాల్ను నిర్మించనున్నారు.