సాగునీటి పనుల్లో స్పీడ్‌ పెరగాలి

20 Apr, 2021 03:42 IST|Sakshi

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీపై సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

ఎర్రబల్లి, హంద్రీనీవా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనులను వేగవంతం చేయాలి

పులివెందుల మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ఈ వారమే భూమి పూజ

సాక్షి, అమరావతి: ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, గాలేరు నగరి నుంచి హంద్రీనీవా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనులను వేగవంతం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. వేంపల్లి భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.92 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. 2019, 2020ల్లో మైదుకూరు, రాయచోటి, కడప, పులివెందుల పర్యటనలో భాగంగా జిల్లాలో నిర్వహించిన శంకుస్థాపనలు, పనుల ప్రగతిని సీఎం పరిశీలించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా)పై ముఖ్యమంత్రి  జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

సీఎం సమీక్ష వివరాలివీ..
► పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఈ వారంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలి.
► వేంపల్లి, పులివెందుల్లో ఒక్కొక్కటి రూ.కోటి వ్యయంతో మోడల్‌ రైతుబజార్ల మంజూరు. 
► పులివెందులలో క్రికెట్‌ స్టేడియానికి 14 ఎకరాల భూమి 
► పులివెందుల మోడల్‌ టౌన్‌ టెండర్లు ఈ నెల 25వతేదీలోగా పిలిచి ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు పనులు ప్రారంభించాలి.
► పెన్నా నదిపై ఆర్టీపీపీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్లాంట్‌కు రహదారి, హైలెవల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి ఆదేశం.
► దీర్ఘకాలంగా ఆగిపోయిన వైఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కొత్త భవనాలకు రూ.66 కోట్లు మంజూరుకు ఆదేశం. 
► కడప ఎయిర్‌పోర్ట్‌లో విమానాల నైట్‌ ల్యాండింగ్‌ కోసం భూసేకరణ నిధులు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశం. 
► బద్వేల్, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై కూడా సీఎం సమీక్షించారు. 

మరిన్ని వార్తలు