బ్యాంకర్లు సహకరించాలి: సీఎం జగన్‌

23 Oct, 2020 17:36 IST|Sakshi

స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో ముఖ్యమంత్రి భేటీ

సాక్షి, తాడేపల్లి: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలో స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో సీఎం వైఎస్‌ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక రంగానికి వ్యవసాయ రంగం వెన్నుముక. రాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఖరీఫ్‌ (జూన్‌)లో 7,500, రబీ (అక్టోబర్‌)లో రూ.4వేలు.. పంట చేతికొచ్చే సమయంలో మరో రూ.2వేలు సాయం చేస్తున్నాం.

రాష్ట్రంలో 10,600కు పైగా ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశాం పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ-క్రాపింగ్ తప్పనిసరి. గతేడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలు కొన్నాం.. ఈ ఏడాది రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో గోడౌన్‌లు, మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు... ప్రతి గ్రామంలో జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నాం. నాడు-నేడు కింద స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన చేపట్టాం. ఆస్పత్రుల్లో కూడా నాడు-నేడు కింద మార్పులు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
(చదవండి: పండుగ వేళ ఉద్యోగులకు సీఎం జగన్‌ తీపి కబురు)

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,100 కోట్ల రాయితీ ఇచ్చాం. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మహిళలకు రుణాలు ఇచ్చాం’అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలలో బ్యాంకర్స్‌ సహకారంపై చర్చించారు. బ్యాంకర్లు కూడా సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, సీఎస్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు