నరసన్నపేట పర్యటనకు సీఎం వైఎస్‌ జగన్‌

18 Nov, 2022 15:03 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం(నరసన్నపేట): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న నరసన్నపేటకు రానున్నారని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్‌లు తెలిపారు. తొలుత 25న వస్తారని అనుకున్నా రెండు రోజులు ముందుగానే పర్యటన ఖ రారైందని వీరు తెలిపారు. ఈ మేరకు గురువారం హెలీప్యాడ్, సభాస్థలి కోసం కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, ఎస్పీ జీఆర్‌ రాధికలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణదాస్‌ స్థల పరిశీలన చేశారు.

అనంతరం జూనియర్‌ కళాశాల మైదానం వద్ద విలేకరులతో మాట్లాడారు. 23 ఉదయం 10గంటలకు జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష (రీసర్వే) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, జమ్ము వద్ద హెలీప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

జమ్ము కూడలి నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా కళాశాల మైదానం వరకూ సీఎం రోడ్‌ షో ఉంటుందని అన్నారు. సభా ఏర్పాట్లను గురువారం రాత్రి నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, ఆర్డీఓ బి.శాంతి, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, నరసన్నపేట సర్పంచ్‌ బూరల్లి శంకర్‌ పాల్గొన్నారు.  

చదవండి: (హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ)

మరిన్ని వార్తలు