వ్యాక్సిన్ల కోసం  గ్లోబల్‌ టెండర్లు 

14 May, 2021 03:01 IST|Sakshi

 ఆ మేరకు టెండర్లు లోడ్‌ చేసిన ఏపీ అధికారులు

బిడ్ల దాఖలుకు 3 వారాల గడువు

300 టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌

యుద్ధ ప్రాతిపదికన చర్యలకు సీఎం జగన్‌ ఆదేశం

45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌

మొదటి డోస్‌ పూర్తి అయిన వారికి రెండో డోస్‌ తర్వాతే మిగిలిన వారికి వ్యాక్సిన్‌

రాష్ట్రానికి ఇప్పటి వరకు 75,49,960 డోసులు రాక

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు వీలైనంత త్వరగా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు వాటి కోసం గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. ఈ విషయాన్ని వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచామని వెల్లడించారు. వ్యాక్సిన్లు సరఫరా చేసే కంపెనీలు మూడు వారాల్లో తమ బిడ్లు దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌పై గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని, మొదటి డోస్‌ పూర్తి అయిన వారికి రెండో డోస్‌ ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్తులో కూడా మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం 600 టన్నులు దాటిన దృష్ట్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం అన్నారు.

రాష్ట్రంలో ప్రతిపాదిత కృష్ణపట్నం స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ప్లాంట్‌కు ఉపయోగపడేలా.. అదే సమయంలో రాష్ట్రంలో రోగుల అవసరాలను తీర్చేలా ఒక ఆక్సిజన్‌ ప్లాంట్‌ను నిర్మించే ఆలోచన చేయాలని చెప్పారు. కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చే విషయమై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కనీసం 300 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఆ ప్లాంట్‌ ఉండాలని, ఇప్పుడున్న ఆక్సిజన్‌కు ఇది అదనం అవుతుందన్నారు. ఇంకా సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.

ఆక్సిజన్‌ సేకరణ, సరఫరా 

  • ఏప్రిల్‌ 20 నాటికి 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయింపులు ఉంటే ప్రస్తుతం వినియోగం సుమారు 600 మెట్రిక్‌ టన్నులకు పైగా చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి కేటాయింపులు 590 టన్నుల వరకు ఉన్నాయని చెప్పారు. 
  • ప్రత్నామ్నాయ విధానాల ద్వారా ఆ లోటు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని, వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్‌ స్టోరేజ్‌ ట్యాంకులు పంపిణీ చేశామని అధికారులు వెల్లడించారు. 
  • లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనాల సంఖ్యను 56 నుంచి 78కి పెంచామని అధికారులు వెల్లడించారు. ట్యాంకరు రాగానే దాని నుంచి రీఫిల్‌ చేసి పంపిణీ చేయడానికి మరో 14 వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 
  • పాత వాహనాల్లో ఉన్న ట్యాంకర్లకు మరమ్మతులు చేసి 44 కిలో లీటర్ల స్టోరేజీ ఏర్పాటు చేశామని,  ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి రోజుకు 210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ తీసుకు రావడానికి 36 వాహనాలను వినియోగిస్తున్నామని వివరించారు. 
  • ఇందులో నాలుగు వాహనాలను ప్రతిరోజూ విజయవాడ నుంచి వైమానిక దళం విమానం ద్వారా భువనేశ్వర్‌కు ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తున్నామని తెలిపారు. 
  •  రాష్ట్రానికి 2 ఐఎస్‌ఓ ట్యాంకర్లు వస్తున్నాయని, దుర్గాపూర్‌లో వాటికి ఆక్సిజన్‌ నింపి తీసుకొస్తున్నామని చెప్పారు. వచ్చే నెల (జూన్‌) మధ్యంతరానికి మరో 25 ట్యాంకర్లు రానున్నాయని వెల్లడించారు. 

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సామర్థ్యం పెంచండి 

  • ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లకు అనుగుణంగా సరైన ప్రెజర్‌తో ఆక్సిజన్‌ వెళ్లేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేవీ, ఇతర సాంకేతిక సిబ్బంది సహాయం తీసుకుని ప్రెజర్‌ తగ్గకుండా అందరికీ సమరీతిలో ఆక్సిజన్‌ వెళ్లేలా చూడాలని సూచించారు.
  • ఇందు కోసం అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు. కాగా, ఆస్పత్రిలో పైపులైన్లను పరిశీలించి, అవసరమైన మార్పులు చేస్తున్నామని, పైపులైన్‌ వ్యవస్థను మెరుగు పరచడానికి నేవీ సహకారం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 

అందుబాటులోకి మరిన్ని సదుపాయాలు 

  • సీఎం ఆదేశాలతో 15 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 10 వేల డి టైప్‌ సిలిండర్లు త్వరలో ఆస్పత్రులకు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా 250 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో ఇప్పటికే 50 సరఫరా చేశామని అధికారులు తెలిపారు. 
  • 125 కిలోలీటర్ల ఆక్సిజన్‌ మెగా స్టోరేజీ ట్యాంకు కోసం విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పారు. దీన్ని ప్రతిపాదిత ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ వద్ద పెట్టించాల్సిందిగా సీఎం ఆదేశించారు. 
  • కొత్తగా 6,500 మెడికల్‌ గ్యాస్‌ పైపులైన్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో 53 చోట్ల పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
  • ఆస్పత్రుల ఆవరణల్లో జర్మన్‌ హేంగర్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్కడున్న ఏరియాను బట్టి కనీసం 25 నుంచి 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని, రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో వీటి ఏర్పాటు పూర్తవుతుందని వివరించారు. 

ఆస్పత్రులు – బెడ్లు 

  • రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం 669 ఆస్పత్రులను గుర్తించగా, వాటిలో మొత్తం 47,693 బెడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిలో 39,749 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, వాటిలో సగానికి పైగా, అంటే 26,030 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయని చెప్పారు. 
  • అన్ని ఆస్పత్రులలో ఐసీయూ బెడ్లు 6513, నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు 23,357, నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు 17,823 ఉన్నాయని తెలిపారు. మొత్తం 3,460 వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పారు.
  • గతేడాది సెప్టెంబర్‌లో కరోనా తొలి దశ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స కోసం 261 ఆస్పత్రులను గుర్తించగా, వాటిలో మొత్తం 37,441 బెడ్లు, 2,279 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది.
  •  కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టులు, జీడీఎంఓ స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు కలిపి మొత్తం 17,901 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వివరించారు.
  • అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 6,42,911 ఎన్‌–95 మాస్కులు, 7,18,086 పీపీఈ కిట్లు, 38,26,937 సర్జికల్‌ మాస్క్‌లు, 82,884 హోం ఐసొలేషన్‌ కిట్లు, 21,340 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 75,49,960 కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు వచ్చాయని, వాటిలో కోవిషీల్డ్‌ 62,60,400 కాగా, కోవాక్సిన్‌ 12,89,560 డోస్‌లు ఉన్నాయని చెప్పారు. 
  • ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తలు