సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు

5 Aug, 2020 14:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా  ఉందంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 
(చదవండి : సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా)

కాగా, ఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌–2019 ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్‌ పోస్టులకు, గ్రూప్‌ఏ, గ్రూప్‌ బి సర్వీసులకు ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు