నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

19 Mar, 2023 02:25 IST|Sakshi

2022 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి 9.86 లక్షల విద్యార్థులకు రూ.698.68 కోట్లు 

తిరువూరులో బటన్‌ నొక్కి డబ్బు జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

టీడీపీ హయాంలోని బకాయిలతో కలిపి ఇప్పటి వరకు రూ.13,311 కోట్లు సాయం 

పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం విప్లవాత్మక కార్యక్రమాలు  

సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభు­త్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది.ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీ­రింగ్, మెడి­సిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.

జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది.   

ఉన్నత విద్యకు ప్రోత్సాహం
► జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. 

► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్ట­డం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అను­గుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్‌ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్‌ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

► ఇంటర్‌ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది.  

► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్‌ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. 

► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశే­షం. విద్యా రంగంపై జగన్‌ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. 

► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేస్తోంది.  

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరువూరు పర్యటన
తిరువూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19న (ఆదివారం) ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.30 గంటల వరకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. అనంతరం విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.   

మరిన్ని వార్తలు