Jagananna Vidya Deevena: విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి

11 Aug, 2022 03:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది.

కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది.

మరిన్ని వార్తలు