YSR Sunna Vaddi Scheme: అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్‌

22 Apr, 2022 14:28 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: గడిచిన మూడేళ్లలో మొత్తం రూ.3,165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేశామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముందుగా సాధికారత సారధులకు అభినందనలు తెలియజేశారు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద ప్రభుత్వం రూ.1,258 కోట్లు చెల్లించిందని, రెండో ఏడాది రూ.1,096 కోట్లు, వరుసగా ఇప్పుడు మూడో ఏడాది రూ. 1,261 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలియజేశారు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని తెలియజేశారాయాన. ‘‘గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదు. పైగా సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు లబ్ధిదారులకు అందించామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ప్రస్తావించారు. అంతేకాదు.. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదని, మంత్రి పదవులు 70 శాతం దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. 

ప్రసంగం అనంతరం.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి జమచేశారు.

చదవండి👉🏼: దుష్టచతుష్టయం అంటే ఎవరంటే..: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు