పాఠశాల విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

5 Jan, 2023 19:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారం రోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబ్‌ను విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశించారు.

ట్యాబ్‌ల వాడకం? పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వివరించారు. డేటా అనలిటిక్స్‌ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా హెడ్‌ మాస్టర్‌, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్న సీఎం.. ఈ డిజిటల్‌ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని సీఎం అన్నారు. వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలని సీఎం పేర్కొన్నారు.

పిల్లలు అందరి వద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం.. లేని పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుక కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యా కానుక అందాలన్నారు. 

సీఎం జగన్‌ ఇంకా  ఏమన్నారంటే..
♦పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలి
♦ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చూసుకోవాలి
♦సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుంది
♦డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశం

♦గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలి
♦అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు
♦నాణ్యత విషయంలో ఎలాంటి రాజీవద్దన్న సీఎం
♦సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక లేబుల్‌తో ఈ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపిన అధికారులు
♦ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్‌ ఇవ్వాలని సీఎం ఆదేశం
♦ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాగిమాల్ట్‌ సరఫరా చేయాలని ఆదేశం
♦వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాసుడు రాగిమాల్ట్‌
♦ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది ఉపయోగపడుతుందన్న సీఎం
♦నాడు-నేడు కింద బాగుచేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలన్న సీఎం
♦ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్న సీఎం
♦నాడు-నేడు రెండో దశ పనులనూ సమీక్షించిన సీఎం
♦22 వేలకుపైగా స్కూళ్లలో పనులు నడుస్తున్నాయన్న అధికారులు
♦దాదాపు రూ.1500 కోట్లు విలువైన పనులు ఇప్పటికే  జరుగుతున్నాయన్న  అధికారులు
చదవండి: నేనున్నానని.. మీకేం కాదని.. సీఎం జగన్‌ తక్షణ సాయం..

ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్‌ మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ జీ వీరపాండ్యన్, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, నాడు నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ (పాఠశాల విద్యాశాఖ) ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు