ఇళ్ల నిర్మాణం కోసం సమన్వయంతో ముందుకెళ్లాలి

7 Dec, 2020 18:53 IST|Sakshi

కోర్టు కేసులు త్వరగా పరిష్కరించాలి..

‘నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష 

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్‌ 25న ఇళ్ల స్థలాలు పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 7 వరకూ  కార్యక్రమం  కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.(చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ సమీక్ష)

కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు. ‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం. మెటీరియల్‌ ఇవ్వండి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి.  ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని’’ సీఎం స్పష్టం చేశారు. (చదవండి: బాబు గారి కపట నాటకం)

ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్‌ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధం చేసుకోవాలని, దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం చురుగ్గా ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలని.. ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలని, దీని తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలి. వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలి. ప్రతి లే అవుట్‌లో నమూనా ఇంటిని (మోడల్‌ హౌజ్‌) నిర్మించాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు
3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు
ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ
రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ
కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం
వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక
పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్‌ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం
175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభం
8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం 
రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం
టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం
300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం రూ.1 రూపాయికే ఇవ్వనున్న ప్రభుత్వం 

మరిన్ని వార్తలు