ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై అధ్యయనం

1 Sep, 2020 04:13 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కేంద్రం సూచించిన సంస్కరణలపై సమీక్షలో సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై కేంద్ర మార్గదర్శకాల అమలు తీరు తెన్నులను ఇతర రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.   

► కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని కేంద్రం మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివరించారు. 
► ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు వివరించారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాన్ని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాలపై చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.
► ఈ సమీక్షలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు