ఆధునిక అంగన్‌వాడీలు 

11 Jan, 2023 02:55 IST|Sakshi

నాడు–నేడుతో రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 

మూడు విడతల్లో మౌలిక వసతుల పనులు పూర్తి  

టీచింగ్‌ క్వాలిటీపై దృష్టి.. మాంటిస్సోరీ విధానంపై అధ్యయనం 

ఆహార పంపిణీలో అలక్ష్యం జరిగితే బాధ్యులపై చర్యలు 

విలేజ్, వార్డు క్లినిక్స్‌తో ‘అంగన్‌­వాడీ’ల్లో ఆరోగ్య పర్యవేక్షణ 

పైలట్‌ ప్రాజెక్టుగా ఫ్లేవర్డ్‌ పాలు... 3 నెలల్లో అన్ని చోట్లా 

లోపాలకు తావులేకుండా తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానం 

మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష  

అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఆ చిన్నారులకు తోడుగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి పట్ల సానుకూల ధృక్పథంతో పని చేయాలి. 10 – 12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.
– సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నాడు–నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించి అంగన్‌వాడీలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేస్తూ మూడు విడతల్లో ఈ పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, ప్రతి మండలంలోనూ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అంగన్‌వాడీల్లో టీచింగ్‌ క్వాలిటీపై మరింత దృష్టి సారించడంతోపాటు మాంటెస్సొరీ తరహా విద్యా విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. 63 సీడీపీవో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలని సూచించారు.

విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగాల తరహాలో మహిళా శిశు సంక్షేమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సమగ్ర పర్యవేక్షణ
అంగన్‌వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణతో చిన్నారులకు ఆహ్లాదకరమైన మంచి వాతావర­ణాన్ని అందించాలి. అంగన్‌వాడీల ద్వారా అందించే పాలు, గుడ్లు పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎస్‌వోపీలు రూపొందించుకోవాలి. ఆహారం పంపిణీలో ఎక్కడైనా లోపాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సూపర్‌వైజర్లపై కూడా పర్యవేక్షణ ఉండాలి. 

ఫ్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ
అంగన్‌వాడీ కేంద్రాల్లో నూటికి నూరుశాతం పిల్లలకు పాల పంపిణీ జరగాలి. పిల్లలకు ఫ్లే్లవర్డ్‌ పాల పంపిణీని పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో ఫ్లే్లవర్డ్‌ మిల్క్‌ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్‌ రూపొందించుకోవాలి. అంగన్‌వాడీలలో బోధనపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహ్లాదకరంగా ఉత్తమ బోధనా విధానాలను అందుబాటులోకి తేవాలి. స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.

విలేజ్, వార్డు క్లినిక్స్‌ సేవలు
అంగన్‌వాడీల్లో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలి. చిన్నారులకు వైద్యపరంగా ఎలాంటి చికిత్స అవసరమైనా ఆరోగ్యశ్రీ వినియోగించుకుని మెరుగైన వైద్యం అందచేయాలి. ఎవరైనా తల్లీబిడ్డలు రక్తహీనత, పౌష్టికాహార లోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే నివారించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి. ఈ విషయంలో అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలి.

రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా అదనంగా అందించి ఆరోగ్యం మెరుగుపడేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దీనిపై సమగ్ర ఎస్‌వోపీలు రూపొందించుకోవాలి. ఈ విధానాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో పరిష్కారం చూపించాలి. తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానాన్ని లోపాలకు తావులేకుండా అమలు చేయాలి.

సమీక్షలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బాబు.ఎ, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు