సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్‌

31 Mar, 2022 14:17 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు & భూ రక్ష పథకంపై గురువారం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.


ఈ సమీక్ష సందర్భంగా.. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు. అంతేకాదు సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌లను సీఎం జగన్‌ పరిశీలించారు. ఏప్రిల్‌ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఆపై సీఎం జగన్‌ అధికారులతో.. 

వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అవినీతి.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని సీఎం వైఎస్‌ జగన్‌.. అధికారులకు సూచించారు. అనుసరించాల్సిన విధానాలు, ఎస్‌ఓపీలను తయారు చేయాలని, రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, ట్యాంపర్‌ చేయలేని విధంగా రూపొందించాలని ఆదేశించారు. కేవలం ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్‌ రికార్డులు కూడా తయారుచేయాలని, ఆ ఫిజికల్‌ డాక్యుమెంట్‌ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని అధికారులతో చెప్పారు. సబ్‌ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్న సీఎం జగన్‌.. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని స్పష్టం చేశారు.  

ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. 
భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి.
భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేనాటికి.. దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలి.
న్యాయశాఖను  కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. 
సమగ్రంగా ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలి. 
భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో  దేశానికి ఒక దిక్సూచిగా ఏపీ నిలవాలని సీఎం జగన్‌ ఆకాంక్ష.
అందుకే సీనియర్‌ అధికారులను, సీనియర్‌ మంత్రులను ఇందులో భాగస్వాములుగా చేసినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఇక మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామన్న అధికారులు.. ఇప్పటివరకూ 1,441 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి చేసినట్లు సీఎం జగన్‌కు వివరించారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్‌ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నామన్న అధికారులు.. రెవెన్యూ విలేజ్‌ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 

సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా అదేసమయంలో రికార్డుల స్వఛ్చీకరణ. 
వెబ్‌ ల్యాండ్‌ అప్‌డేషన్, గ్రామ ల్యాండ్‌ రిజిస్టర్‌ అప్‌డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం అందజేత. 
గ్రామ సచివాలయాల వారీగా.. భూ వివరాలను అప్‌డేషన్‌ చేయనున్న అధికారులు.
► తద్వారా.. గతంలో వెబ్‌ల్యాండ్‌ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం.
5,200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి.   
ఓఆర్‌ఐ (ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్‌ నెలాఖరు నాటికి, మూడోవిడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని చెప్పిన అధికారులు.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం,  సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధ జైన్‌.. ఇతర అధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు