నా బిడ్డ ప్రాణం నిలిపినందుకు.. థాంక్యూ సీఎం సర్‌ 

10 Nov, 2022 05:01 IST|Sakshi
తిరుపతికి వెళుతున్న రాంబాబు, ప్రసాద్‌

తిరుమలకు పాదయాత్ర చేస్తున్న హనీ తండ్రి 

చిన్నారి వైద్యానికి రూ.కోటి మంజూరు చేసిన సీఎం జగన్‌ 

అమలాపురం టౌన్‌ : తన కుమార్తె హనీకి వచ్చిన అరుదైన గాకర్స్‌ వ్యాధి చికిత్సకు రూ.కోటి మంజూరు చేసి ప్రాణం నిలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బాలిక తండ్రి కొప్పాడి రాంబాబు విభిన్న పద్ధతిలో కృతజ్ఞతలు చెబుతున్నాడు. గత జూలై 26న కోనసీమ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు  సీఎం జగన్‌ వచ్చారు.

ఆ సమయంలో రాంబాబు తన కుమార్తె వైద్యం కోసం అత్తవారి ఊరు కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరంలో ఉన్నాడు. హనీ అరుదైన వ్యాధి విషయం గురించి తెలుసుకుని సీఎం జగన్‌ చలించిపోయారు. హనీ వైద్య సాయం కోసం కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు ఆదేశాలిచ్చారు. అంతేకాదు బాలిక వైద్యానికి రూ.కోటి కేటాయించడంతో పాటు తొలి విడతగా అమెరికా నుంచి రూ.10 లక్షలతో బాలికకు అవసరమైన ఇంజెక్షన్లు తెప్పించి వైద్యం చేయించారు.

ఈ నేపథ్యంలో రాంబాబు తన బావమరిది సంగాడి ప్రసాద్‌తో కలిసి.. సొంతూరు అయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక నుంచి ఈ నెల 7న తిరుమలకు పాదయాత్రగా బయలుదేరాడు. వీరు ధరిస్తున్న టీ షర్టులపై ముందు వెనుకా కూడా సీఎం జగన్‌ చిత్రాలు ముద్రించారు.

సీఎం జగన్‌తో తాను, తన కుమార్తె హనీ తీసుకున్న ఫొటోతో పాటు, జగనన్న సీఎంగా ఉండటం మన అదృష్టం.. పేదలకు వరం.. థాంక్యూ సీఎం సర్‌.. అని రాయించాడు. ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. తిరుపతి చేరేందుకు మరో 12 రోజులు పడుతుందని రాంబాబు తెలిపాడు. 

మరిన్ని వార్తలు