సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు

11 Nov, 2022 14:47 IST|Sakshi

సాక్షి, అమలాపురం టౌన్‌: పట్టణంలోని నారాయణపేటకు చెందిన 9 ఏళ్ల దంగేటి జశ్వంత్‌ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి తొలి విడతగా రూ.12 లక్షలను గురువారం మంజూరు చేశారు. జశ్వంత్‌ శస్త్ర చికిత్సకు రూ.21 లక్షలు ఖర్చువుతుందని, అంత ఖర్చు భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదని, మీరే ఆదుకోవాలని ఈ నెల 4న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సెంట్రల్‌ డెల్టా బోర్డు చైర్మన్‌ కుడుపూడి బాబు తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే.

చలించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుడుపూడి బాబు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లిన మర్నాడే తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి అమలాపురంలోని రోగి జశ్వంత్‌ ఇంటికి వెళ్లి అతని వైద్య రికార్డులను పరిశీలించి వెళ్లారు. జశ్వంత్‌ తండ్రి కనకరాజును తాడేపల్లికి గురువారం వచ్చి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరు చేసిన రూ.12 లక్షల చెక్‌ను తీసుకుని వెళ్లాలని వర్తమానం వచ్చిది.

కనకరాజు గురువారం తాడేపల్లి వెళ్లి ఆ చెక్‌ను తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికన్‌ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ కేన్సర్‌ సెంటరు పేర చెక్‌ ఇచ్చారు. మిగిలిన రూ.9 లక్షలను జశ్వంత్‌కు శస్త్ర చికిత్స అయిన తర్వాత ఆ ఆస్పత్రి ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా మంజూరు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. సీఎంకు జశ్వంత్‌ కుటుంబీకులు, కుడుపూడి బాబు కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: (అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు