విద్యుత్‌ రంగంలో మరో ముందడుగు 

28 Oct, 2022 01:55 IST|Sakshi
నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో నిర్మించిన 3వ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు

నేలటూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 3వ యూనిట్‌ జాతికి అంకితం  

నాడు వైఎస్సార్‌ శ్రీకారం.. నేడు మనందరి ప్రభుత్వంలో పూర్తి 

మూడేళ్లలో రూ.3,200 కోట్ల వ్యయం.. మరో 800 మెగావాట్ల విద్యుత్‌.. ఈ సూపర్‌ 

క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌కు తక్కువ బొగ్గు వినియోగం 

ఏపీ గ్రిడ్‌కు రోజూ 19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌  

16,337 మత్స్యకారేతర కుటుంబాలకు పరిహారం జమ 

నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు  

రూ.93 కోట్లతో సబ్‌మెర్సిబుల్‌ కాజ్‌వే, రూ.25 కోట్లతో ఫిషింగ్‌ జెట్టి ఏర్పాటుకు శంకుస్థాపనలు  

రెండు హైలెవల్‌ వంతెనల కోసం రూ.22 కోట్లు మంజూరు 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  విద్యుత్‌ రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో నిర్మించిన 3వ యూనిట్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు నిర్వాసితుల ఖాతాల్లో మత్స్యకారేతర పరిహారం జమ చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ఏపీ జెన్‌కో స్వయంగా నిర్మించిన 800 మెగావాట్ల ప్లాంటును మీ అందరి సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నానని చెప్పారు.

ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి (నాన్న గారు) 2008లో శంకుస్థాపన చేశారని తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఈ పవర్‌స్టేషన్‌ నిర్మాణానికి ఆ మహానేత శ్రీకారం చుట్టగా, నేడు మనందరి ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంతో దానిని ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవర్‌ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 
 
నాణ్యమైన, నిరంతర విద్యుత్‌   
►రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు, వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.  
►మననందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు రూ.3,200 కోట్లు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేశాం. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి.  
►ఈ రోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకు 19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఏపీ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుతో పోల్చితే సూపర్‌ క్రిటికల్‌ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుంది. 
 
భూములిచ్చిన రైతులకు అభివాదం 

► ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్‌ పవర్‌ ప్లాంటు.. ఈ రెండూ ఈ ప్రాంతంలో రావాలి. వీటి ద్వారా జిల్లా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ నిండు మనసుతో శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నా.  
► వీళ్లందరికీ మంచి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియను ఈ నవంబర్‌ పూర్తయ్యేలోగా ప్రారంభించాలని ఆదేశించాం.   
 
నెరవేరిన మరో ఎన్నికల హామీ 

► ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు ఎన్నికల వేళ ఆరోజు మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడుకు మేమంతా గుర్తుకు వస్తామని ఆ రోజు మీరందరూ చెప్పారు.  
► ఆయన ఐదేళ్ల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా, హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. మీ అందరి కష్టాలు నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు నేను చెప్పాను.  
► ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలకు కూడా బటన్‌ నొక్కి నేరుగా రూ.36 కోట్ల పరిహారాన్ని వాళ్ల బ్యాంక్‌ అకౌంట్లో జమ చేస్తున్నాం. ఆ వేళ హడావుడిగా కేవలం మోసం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వని పరిస్థితులు. ఈ రోజు వాళ్లకు మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా, మిగిలిపోయిన 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ, అందరికీ ఈ ప్యాకేజీ ఇస్తున్నాం.  
 
ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్‌మెర్సిబుల్‌ కాజ్‌వే 
► నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్‌మెర్సిబుల్‌ కాజ్‌వే నిర్మాణం కోసం రూ.93 కోట్ల కేటాయిస్తూ.. దానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. నా సోదరుడు, శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరిక మేరకు ఈ కాజ్‌వే నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా.  
► ఇటువంటి ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా అడుగుతున్నా, పట్టించుకోని పాలకులను మనం చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రంలోకి వెళ్లే నీటిని ఆపగలుగుతాం. సముద్రం నుంచి వచ్చే బ్యాక్‌ వాటర్‌నూ ఆపగలుగుతాం. తద్వారా నాలుగు మండలాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల ప్రారంభించిన నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతున్నాం. 
 
మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టీ  
► ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ప్రత్యేక జట్టీ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో శంకుస్థాపన చేశాం.  ఉప్పుకాలువ, వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాళెం హైలెవల్‌ బ్రిడ్జి కోసం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రూ.12 కోట్లు అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాం. మరో హైలెవల్‌ బ్రిడ్జి.. నెల్లూరు నక్కలవాగు – కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటంపాడు (వయా బ్రహ్మదేవం) వరకు మరో రూ.10 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నా.  
► ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలని, ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. 
 
మనం గర్వించాల్సిన రోజు   
మనం నిజంగా గర్వించాల్సిన రోజిది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజీ కోసం ప్రతి వాగ్దానం చేయడం, అమలు చేయకపోవడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. 3,500 మంది ఎస్సీ, ఎస్టీలకు గాను వారిలో కూడా టీడీపీ వారికే ఇస్తామని, వైఎస్సార్‌సీపీ వారిని పక్కనపెట్టండని చెప్పి.. ఎవరికీ ఇవ్వలేదు.

మా నాయకుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట మేరకు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజీ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో కేవలం 7 పంచాయతీలు మాత్రమే ప్యాకేజీకి ఎంపిక చేశారు. మన ప్రభుత్వం 20 పంచాయతీలతో పాటు, పోర్టుకు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి భూములు ఇచ్చిన వారందరికీ రూ.36 కోట్ల ప్యాకేజీ ఇస్తోంది. జగనన్న ఏమి అడిగినా ఇస్తున్నారు. ఉప్పుకాలవ మీద రూ.12 కోట్లతో బ్రిడ్జి, కృష్ణపట్నం నక్కలకాలువ వాగు మీద రూ.9.40 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయాలని అడుగుతున్నాం. 
– కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి 
 
విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు 
ఈ రోజు 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 3వ యూనిట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ విద్యుత్‌ స్టేషన్‌ దేశంలోనే మొదటిది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో విద్యుత్‌ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అడ్డగోలు పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లతో చంద్రబాబు రూ.20 వేల కోట్లకు పైగా నష్టాల్లోకి తోశారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్‌ వినియోగాన్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచాలని సీఎం జగన్‌ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు.

పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఖర్చు తగ్గేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవి ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ట్రాన్స్‌కో అభివృద్ధికి రూ.4 వేల కోట్లతో ఎన్నో చర్యలు తీసుకున్నారు. రూ.40 వేల కోట్ల ఆర్థిక సాయంతో డిస్కంల ఆదుకుంటున్నారు. ఇవాళ మనం 45 శాతం విద్యుత్‌ను జెన్‌కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా పలు విధాలా ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుష్టచతుష్టయం దు్రష్పచారం చేస్తోంది. నిత్యం అసత్యాలు వల్లించే ఈ పచ్చ పత్రికలు చదవద్దని, పచ్చ టీవీలు చూడద్దని విజ్ఞప్తి చేస్తున్నా.  
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి    

మరిన్ని వార్తలు