గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు: సీఎం జగన్‌

11 Aug, 2022 02:41 IST|Sakshi

ఇప్పటికే ఉన్న వాటికి ఏడాదిలోగా నాడు–నేడు కింద మరమ్మతులు 

అద్దె భవనాల్లో ఉన్న వాటి స్థానంలో కొత్తగా నిర్మాణం 

సంక్షేమ హాస్టళ్లకు కొత్త రూపు తీసుకొచ్చేందుకు సమగ్ర కార్యాచరణ 

స్కూళ్ల నిర్వహణ నిధి తరహాలో హాస్టళ్ల నిర్వహణకూ ప్రత్యేక నిధి 

హాస్టళ్ల నిర్వహణ ఖర్చులు, డైట్‌ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు  

తప్పకుండా వైద్యులు సందర్శించేలా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ 

ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి. మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో, అలాంటి వసతులే ఉండాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ప్రస్తుతం ఉన్న డైట్‌ చార్జీలను నిశితంగా పరిశీలించి.. పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటామో అదే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకు రావాలని చెప్పారు. నాడు–నేడు పథకం కింద ఏడాదిలోగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం ఆయన గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న దానిపై తాను స్వయంగా పరిశీలన చేయించానని, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందన్నారు. దీనిపై ఒక స్పష్టమైన కార్యాచరణతో అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు.

ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని చెప్పారు. ‘ఈ పనులు మావి’ అనుకుని పని చేయాలని కోరారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఇప్పటికే నాడు – నేడు కింద తొలి దశలో స్కూళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. మొదటి దశలోని స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మించే పని జరుగుతోందన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోనందున, అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలని చెప్పారు. అభివృద్ధి పనులు చేశాక, వాటి నిర్వహణ కూడా బావుండేలా దృష్టి పెట్టాలని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సరిపడా సిబ్బంది ఉండాలి..
► స్కూళ్ల నిర్వహణ ఫండ్‌ మాదిరిగానే హాస్టళ్ల నిర్వహణ ఫండ్‌ను ఏర్పాటు చేయండి. ప్రతి హాస్టల్‌లో తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి. హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్‌మెన్‌.. ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోండి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్‌ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. నెలకోసారి హాస్టల్‌ను సందర్శించాలి.
► విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా డైట్‌ చార్జీలను పెంచాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్‌ చార్జీలను పెంచింది. అప్పటి వరకూ హాస్టల్‌ విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. 

ఏడాదిలోగా హాస్టళ్లలో నాడు–నేడు పూర్తవ్వాలి
► అద్దె ప్రాతిపదికన నడుస్తున్న వసతి గృహాలపై కూడా దృష్టి సారించాలి. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించండి. అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. 
► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రతి పనిలోనూ నాణ్యత చాలా ముఖ్యం. వీటికి అదనంగా కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లను కూడా చేర్చాలి. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించాలి. ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలి.
► ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు