విశాఖ రాజధాని కాబోతోంది.. పెట్టుబడులకు ఆహ్వానం: ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహాక సమావేశంలో సీఎం జగన్‌

31 Jan, 2023 12:57 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలని, పరిశ్రమలకు స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం  ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు జరగ్గా.. అందులో పాల్గొని ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు. 

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా ఉంటోందని  సీఎం జగన్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు.

పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే మేం నెంబర్‌ వన్‌గా ఉన్నాం. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో.. మూడు ఏపీకే రావడం శుభపరిణామం. సింగిల్‌ డెస్క్‌ సిస్టమ్‌ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. 

రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందని, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్‌.. మీతో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఏపీలో అభివృద్ధిని చూపించాలని ఇన్వెస్టర్లను కోరారు.

>
మరిన్ని వార్తలు