అందుకే సాధ్యమైంది.. వరుసగా మూడోసారి నంబర్‌వన్‌: సీఎం జగన్‌

28 Sep, 2022 12:30 IST|Sakshi

సాక్షి, నంద్యాల జిల్లా: రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. కొలిమిగుండ్లలో బుధవారం.. రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభలో సీఎం ప్రసంగిస్తూ రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని అన్నారు.

‘‘కర్నూలు జిల్లాలో గ్రీన్‌ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగావకాశాలు రావాలి. రానున్న 4 ఏళ్లలో 20వేల ఉద్యోగాలు వస్తాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ వరుసగా 3వ సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది. మాది ఇండస్ట్రీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం’’ అని సీఎం జగన్‌ అన్నారు.

ఈ సారి పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చారు. సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు చెల్లిస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా ఉండాలి. గ్రోత్‌ రేటులో దేశంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది.రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు.


చదవండి: రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు