CM YS Jagan: కాన్వాయ్‌ ఆపి.. గోడు విని..

27 Aug, 2022 07:29 IST|Sakshi
సీఎం జగన్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న త్రివేణి

విశాఖలో వివాహితకు, దంపతులకు సీఎం జగన్‌ భరోసా

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం నగరానికి వచ్చిన ఆయన.. సిరిపురం ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో జరిగిన మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.

అక్కడ నుంచి మ.1.10 గంటలకు విమానాశ్రయానికి బయల్దేరారు. కాన్వాయ్‌ సిరిపురం జంక్షన్‌ దాటుతుండగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు చంటిపిల్లలతో ముందుకు వచ్చి.. జగనన్నా, జగనన్నా అంటూ బిగ్గరగా అరిచారు. వెంటనే సీఎం జగన్‌ తన కాన్వాయ్‌ని ఆపి బయటకు దిగి వారిని రమ్మని పిలిచారు. వారంతా సీఎం వద్దకు చేరుకున్నారు. తన పేరు ధర్మాల త్రివేణి అని.. తన భర్త అప్పలరెడ్డిని నెలన్నర క్రితం పెదవాల్తేరులో రూ.500 కోసం చంపేశారని.. పెద్ద దిక్కు కోల్పోయామన్నారు. పిల్లలతో కుటుంబ పోషణ కష్టమవుతోందని.. ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. సీఎం దానిని తీసుకుని తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తమ విన్నపాన్ని సానుకూలంగా విన్నారంటూ వారు ఉద్వేగానికి లోనయ్యారు.

చిన్నారులకు వైద్యంపై కలెక్టర్‌కు ఆదేశం
అదే సమయంలో.. శ్రీకాకుళం జిల్లా డీఆర్‌ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంగి రామారావు, సుబ్బలక్ష్మి దంపతులు కూడా తమ ఇద్దరి కుమారుల కష్టాన్నీ సీఎంకు విన్నవించుకున్నారు. వారిద్దరూ సికిల్‌సెల్‌ థలసేమియాతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో సీఎం జగన్‌ స్పందిస్తూ.. చిన్నారులకు సరైన వైద్యం చేయించాలంటూ అక్కడికక్కడే కలెక్టర్‌ను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: బాబు ‘అప్పు’డే  లెక్క తప్పారు

మరిన్ని వార్తలు